
రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు అమలు పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి కల్పించాలని రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తుందని అన్నారు.ప్రభుత్వం చేసే ఖర్చు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావాలని, గ్రామంలో ఒకే రకమైన యూనిట్లు గ్రౌండ్ కాకుండా చూడాలని ఎంపిడీఓ లను ఆదేశించారు. మండలం వారీగా ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని అన్నారు. మొదటగా రూ.50,000 నుంచి రూ.1 లక్ష లోపు యూనిట్లకు జూన్ 2 రోజున ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. యూనిట్ ఖర్చు మార్చాలనుకునే లబ్ధిదారులు, దరఖాస్తులో చూపిన ఖర్చు కంటే తక్కువగా మాత్రమే మార్పులు చేసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.యువ వికాసం పథకం క్రింద వచ్చే సహాయంతో యువత వ్యాపారం చేసి లబ్ది పోందాలని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేసి,పరిశీలించిన జాబితాను వెంటనే జిల్లా స్థాయికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మండలాలు,మున్సిపాలిటీల వారీగా ఇందిరమ్మ ఇళ్ల అర్హులైన లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.అర్హుల వివరాల జాబితాను వెంటనేఅందజేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగ రావు, డిపిఓ నాగేంద్రం,ఈ.డి ఎస్సీ కార్పొరేషన్ రమేష్ బాబు, ఎల్డీయం శ్రీనివాస రావు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఒలు, తదితరులు పాల్గొన్నారు.
జారీ చేయువారు: – డిపిఆర్ఓ/ జోగులాంబ గద్వాల జిల్లా.
