TEJA NEWS

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలి : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ జంట సర్కిళ్లయిన కుత్బుల్లాపూర్, గాజుల రామారం ఉప కమిషనర్లు, వివిధ విభాగాల అధికారులతో వివిధ డివిజన్లు, కాలనీలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిబ్బందిని సమాయత్తం చేస్తూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సిద్ధంగా ఉండాలని, అలాగే వివిధ కాలనీలలో, బస్తీలలో కొనసాగుతున్న రోడ్డు, భూగర్భ డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

జంట సర్కిళ్ల లోని బస్తీలలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ది పనులను చేపట్టడంతో పాటు నూతన పనులకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.

వివిధ డివిజన్లలో అసంపూర్తిగా ఉన్న నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

కాలనీలలో పిల్లలు, పెద్దలకు ఆహ్లాద భరితంగా ఉన్న పార్కులను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ఓపెన్ జిమ్ ల నిర్వహణ, ప్రహరీ గోడ నిర్మాణం వంటి చర్యలు చేపట్టాలన్నారు.

జంట సర్కిళ్ల పరిధిలోని శ్రీనివాస్ నగర్, కళావతి నగర్, దేవేందర్ నగర్, భగత్ సింగ్ నగర్, పద్మా నగర్ ఫేస్ 1 కాలనీలలోని స్మశాన వాటికలను ఆధునీకరించి మోడర్న్ గ్రేవ్ యార్డ్ నిర్మించాలని సూచనలు చేశారు.

మోడల్ మార్కెట్లను ప్రజా అవసరాలకు ఉపయోగపడేలా 100% వినియోగించాలి. అవసరమైన చోట కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను చేపట్టి ప్రజలకు అవసరమయ్యేలా చూడాలి.

జగద్గిరిగుట్ట అవుట్ పోస్ట్ వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సిగ్నల్ లను ఏర్పాటు చేయాలి.

జగద్గిరిగుట్ట చివరి బస్టాప్ లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులలోని సిబ్బంది కోసం విశ్రాంతి గదులు, టాయిలెట్ల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలి.

పరికచెరువులో మురుగునీరు కలవకుండా శుద్ధికరణ చర్యలు చేపట్టి చెరువును సుందరీకరించాలి.

128 చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నా పనులను చేపట్టి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలి.

129 సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.

130 సుభాష్ నగర్ డివిజన్ రాజీవ్ గృహకల్ప నుంచి ఎస్.ఆర్. నాయక్ నగర్ వరకు నాలా పనులను అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిర్మించాలి.

విద్యాసంస్థలు, ఆస్పత్రులు అధికంగా ఉన్న చింతల్ మెయిన్ రోడ్ లో పాదాచారులు రోడ్డు దాటేందుకు అనుగుణంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలి.

పాపయ్య యాదవ్ నగర్ నుంచి బాలానగర్ బిబిఆర్ ఆసుపత్రి వైపుగా వెళ్ళే నాలా విస్తరణ పనులను చేపట్టే విధముగా కూకట్ పల్లి సర్కిల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలి. తద్వారా కుత్బుల్లాపూర్ లో వరద ప్రవాహం సాఫీగా సాగుతుందని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా చూడాలని, ఈ పథకాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకొనేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఏర్పాటుచేసిన డివిజన్ వార్డు ఆఫీసులలో నిర్ణీత సమయాన్ని నిర్దేశించి అధికారులు, సిబ్బంది ఉండి ప్రజలకు సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్లు నరసింహ, మల్లారెడ్డి, కార్పొరేటర్లు జగన్, విజయ శేఖర్ గౌడ్, రషీదా మహమ్మద్ రఫీ, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, కెఎం.గౌరీష్, ఇంజనీరింగ్ విభాగం ఈఈలు లక్ష్మీ గణేష్, కిష్టప్ప, డీఈ లు పాపమ్మ, శిరీష, రూపాదేవి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.