TEJA NEWS

రైతులకు సునాయాసంగా అర్థమయ్యే, నిర్భయంగా ఉంచే చట్టం భూభారతి……… మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీధర్
వనపర్తి
రైతులకు సునాయసంగా అర్థమై భూ సమస్యలు లేకుండా నిర్భయంగా ఉంచగలిగేదే భూ భారతి చట్టం అని మక్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.
సోమవారం, అమరచింత మండలంలోని నాగర్ కడ్మూర్ , ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామ రైతు వేదికలలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం – 2025 (ఆర్. ఒ.ఆర్ యాక్ట్) అవగాహన కార్యక్రమానికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రైతుకు భూమికి ఉన్న బంధాన్ని ప్రపంచంలో ఎవరు విడదీయలేరని అన్నారు. ఒక చిన్న వ్యాపారి తన వ్యాపారంలో నష్టం వస్తె ఒకటికి రెండు సార్లు చూసి వ్యాపారం మూసేస్తాడు. కానీ రైతుకు తన భూమిలో పంట వేసినప్పుడు ఎన్నిసార్లు నష్టం వచ్చిన తన భూతల్లి ఎప్పటికైనా మేలు చేస్తుందని మళ్ళీ మళ్ళీ వ్యవసాయం చేస్తాడని కొనియాడారు.
ఇంతటి అనుబంధం ఉన్న భూమి తనకు ఎన్ని ఎకరాలు ఉన్నవి వాటి ఆధారం చూపే పట్టా పాస్ పుస్తకం చూసుకొని ధైర్యంగా ఉంటాడన్నారు.
ఒకప్పుడు పటేల్ పట్వారీ జమానాలో రైతులకు అన్యాయం జరుగుతుందని భావించిన అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు రైతులకు తోక బుక్కు స్థానంలో పట్టా పాసు పుస్తకాలు ఇచ్చి రైతులకు భరోసా ఇచ్చాడన్నారు. ఆ తర్వాత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పట్టాదారు పాసు పుస్తకంతో పాటు టైటిల్ బుక్ ఇచ్చి భూమి పైన బ్యాంకు రుణాలు పొందే విధంగా చేశారని గుర్తు చేశారు.
2020 లో తెచ్చిన ధరణి చట్టం రైతులను గందరగోళానికి గురి చేసి అనేక సమస్యలకు కారణమయ్యిందని తెలిపారు. ధరణి పాసు పుస్తకంలో ఖాస్తు కాలాన్ని తొలగించారన్నారు. వాళ్ళు అనుకున్న భూమిని బి. కేటగిరీలో పెట్టీ రైతులకు అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు.
ధరణి పాసు పుస్తకంలో పేరులో చిన్న తప్పు పడిన, లేదా భూమి విస్తీర్ణంలో తేడా అయిన తహశీల్దారుకు దరఖాస్తు చేస్తే వారి చేతిలో ఏమి ఉండేది కాదు. రైతులు కలెక్టర్ కార్యాలయం చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగేదన్నారు. అధికారులు తప్పు చేసిన కోర్టు చుట్టూ తిరిగే దుస్థితి ఉండేదన్నారు.
రైతుల సమస్యలను తెలుసుకున్న అప్పటి పి.సి.సి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ధరణి లోపాలను సరిదిద్దేందుకు 14 నెలలు మేధావులు, కలెక్టర్లతో చర్చించి రైతులకు సులువుగా తన భూమి వివరాలు తెలుసుకునే విధంగా తీసుకువచ్చిందే భూ భారతి చట్టమని వివరించారు. రైతుల పేర్లు తప్పు పడినా, విస్తీర్ణంలో తేడా ఉన్నా తహసిల్దార్ దగ్గరే సరి చేయించుకునే అవకాశం భూ భారతిలో కల్పించిందన్నారు.
రైతులకు భూ భారతి చట్టం పై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ , ప్రజా ప్రతినిధులు స్వయంగా ప్రతి మండలానికి తిరిగి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రైతులు ఎవరి పై ఆధార పడకుండా, ఎవరి నుండి మోసపోకుండా ఉండాలంటే భూ భారతి చట్టం పై క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువకులు సైతం భూ భారతి చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా ఏ చట్టం తీసుకువచ్చిన చట్టం పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని అందుకే కొత్తగా వచ్చిన భూ భారతి ఆర్. ఒ.ఆర్. చట్టం పై మండల స్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ప్రతి వ్యక్తికి భూమితో సంబంధం ఉంటుందని ఏదో ఒక సమయంలో అవసరం వస్తుందన్నారు. అంత ముఖ్యమైన భూమి, భూ చట్టాల పై ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాలని సూచించారు. సమస్యలు వచ్చి న్యాయ వ్యవస్థకు వెళ్ళాక చట్టంలో ఉన్న అంశం నాకు తెలియదు అనిచెప్పడానికి వీలు లేదన్నారు.
ఇంతకు ముందు ఉన్న ధరణి చట్టంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మేధావులతో చర్చించి పటిష్టమైన భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.
భూ భారతి చట్టం ప్రకారం ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ చేసే ముందు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నాలుగు దిక్కుల హద్దులు నిర్ణయించుకొని పట్టా పాస్ పుస్తకంలో భూమి వివరాలతో పాటు పటం ముద్రించడం జరుగుతుందన్నారు. తద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదన్నారు. రిజిస్ట్రేషన్ లో లేదా మ్యుటేషన్, సక్సెషన్ సమయంలో తప్పు జరిగిందని భావిస్తే ఆర్డీఓ కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆర్డీఓ స్థాయిలో కూడా తప్పు చేస్తే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. పాస్ పుస్తకం తో పాటు ప్రతి భూకమతానికి ఒక భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి రిజిస్ట్రేషన్ లేదా మ్యుటేషన్ చేయించుకున్న లేదా అధికారులు తప్పు చేసిన అప్పీల్ చేసుకుంటే తప్పు చేసిన వారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకొని తప్పును సరి చేసే అవకాశం భూ భారతి చట్టంలో అవకాశం ఉందన్నారు.
ఇతరుల భూ రికార్డులు కావాలి అనుకుంటే తహసిల్దార్ సర్టిఫై తో వివరాలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి తండ్రి చనిపోతే ఇద్దరు స్లాట్ బుక్ చేసుకొని ఇద్దరమే హక్కుదారులమి అన్యాయంగా మ్యుటేషన్ చేయించుకుంటే ఇంతకు ముందు చట్టంలో తప్పు సరిదిద్దుకోవడానికి వీలు లేకుండా పోయిందన్నారు. భూ భారతి చట్టంలో నోటీస్ ఇచ్చి సరిదిద్దుకునే అవకాశం ఉందన్నారు.
పెండింగ్ లో ఉన్న సాదా బైనామా కేసులను సైతం ఆర్డీఓ క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించుకునే అవకాశం భూ భారతి చట్టంలో కల్పించిందన్నారు. అందుకే భూ భారతి చట్టం పై ప్రజలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని అందుకే చట్టం గురించి కరపత్రాలు పంచడం జరుగుతుందన్నారు.
భూ భారతి చట్టం గురించి ఆర్డీఓ సుబ్రమణ్యం ప్రజలకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.
ఆత్మకూరు తహసిల్దార్ చాంద్ పాషా, జిల్లా అధికారులు, మండల అధికారులు, కల్లు గీత కార్మికుల అధ్యక్షుడు నాగరాజు గౌడ్, ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.