
చెరువుల్ని పూర్తిగా నింపి, ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడండి : మాజీమంత్రి ప్రత్తిపాటి
పట్టణ ప్రజలకు తాగునీరు అందించే చెరువుల్ని పరిశీలించిన ప్రత్తిపాటి
సాగర్ నీటితో చెరువులు నింపి, వృథాలేకుండా ప్రజలకు నీరు అందించాలని అధికారులకు ఆదేశం
పట్టణ ప్రజలకు తాగునీరు అందించే రెండు మంచినీటి చెరువుల్ని సాగర్ నీటితో పూర్తిగా నింపి, ప్రజలకు నీటిఇబ్బందులు లేకుండా చూడాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అధికారులకు సూచించారు. పట్టణశివారులోని తాగునీటి చెరువుల్లోకి చేస్తున్న నీటి పంపింగ్ ను ప్రత్తిపాటి అధికారులతో కలిసి పరిశీలించారు. ఒకట్రెండు రోజుల్లో సాగర్ నుంచి వచ్చే నీటితో చెరువులు సంపూర్ణంగా నిండాలని, నీటి పంపింగ్ లో ఎదురయ్యే సమస్యల్ని త్వరగా అధిగమించాలని ప్రత్తిపాటి అధికారులకు సూచించారు. అన్ని మోటార్లు రన్ చేసి త్వరగా చెరువుల్లోకి నీరు వచ్చేలా చూడాలన్నారు. తర్వాత ఆ నీటిని నిత్యం నిర్ణీత సమయానికి ప్రజలకు సక్రమంగా అందించాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది చెరువులు నిండుకుండల్లా జలకళను సంతరించుకున్నాయని, నీరు సమృద్ధిగా ఉండటంతో పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యలు ఉండవని ప్రత్తిపాటి చెప్పారు. గత ప్రభుత్వం పట్టణ ప్రజలకు సక్రమంగా తాగునీరు కూడా అందించలేదన్న ప్రత్తిపాటి, కూటమిప్రభుత్వంలో నిత్యం నీటిసరఫరా జరిగేలా అన్నిచర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే నైరుతి ప్రభావంతో వర్షాలు ప్రారంభమై, పై ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కు వరద వస్తోందని, త్వరలోనే సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీరు కూడా విడుదల చేయడం జరుగుతుందన్నారు.
నకిలీ విత్తనాలు.. ఎరువులతో రైతుల్ని మోసగించేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోండి…
తొలకరి వానలు మొదలవడంతో రైతులు సాగుపనుల్లో నిమగన్నమయ్యారని, ఖరీఫ్ ప్రారంభం దృష్ట్యా వ్యవసాయ అధికారులు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రత్తిపాటి సూచించారు. విత్తనాలు, ఎరువులు సరిపడినన్ని అందుబాటులో ఉంచడమేగాక, సకాంలో అవి రైతులకు అందించాల్సిన బాధ్యత అధికారులదేనని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. నకిలీ విత్తనాల తయారీ.. అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతుల్ని మోసగించి లాభపడదామనుకునే వారి ఆటకట్టించాలని ప్రత్తిపాటి వ్యవసాయ సిబ్బందికి సూచించారు. విత్తన, ఎరువుల వ్యాపారం చేసేవారిపై పూర్తి నిఘా ఉంచాలని, నకిలీవి అంటగట్టి రైతుల్ని మోసగించేవారిని చట్టపరంగా శిక్షించాలని ప్రత్తిపాటి ఆదేశించారు. చెరువుల పరిశీలనకు వెళ్లిన ప్రత్తిపాటి వెంట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్ మోహన్, మద్దుమల రవి, జంగా వినాయకరావు, జంగా సుజాత, తుపాకుల అప్పారావు తదితరులున్నారు.
