
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అంశంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. దళితుడిని కిడ్నాప్ చేసినందుకు వల్లభనేని వంశీ జైలుకెళ్లారని స్పష్టం చేశారు. వంశీపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. తప్పు చేసిన వైసీపీ నేతలు శిక్షలు తప్పించుకోలేరని లోకేశ్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ అరాచక పాలనను అందరూ చూశారని, ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
లోకేశ్ ను కలిసిన వెటర్నరీ విద్యార్థులు
కాగా, వెటర్నరీ విద్యార్థులు ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. వారి సమస్యలను లోకేశ్ సానుకూల ధోరణితో విన్నారు. ఎన్టీఆర్ వర్సిటీ వెటర్నరీ విద్యార్థులు స్టయిఫండ్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు సమానంగా స్టయిఫండ్ ఇవ్వాలని కోరారు. వెటర్నరీ విద్యార్థుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని లోకేశ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
