TEJA NEWS

జూన్ 8 చేప ప్రసాదం పంపిణీ- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు-ఈసారి లక్షన్నర చేపలు సిద్ధం

ప్రతీ ఏటా తెలుగు రాష్ట్రాల ప్రజలకు బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదం ఓ పండుగలా జరుగుతుంది.భారీగా జనం ఈ చేప ప్రసాదం కోసం పోటీ పడుతుంటారు. ఈ ఏడాది జూన్ 8వ తేదీన ఈ చేప ప్రసాదం పంపిణీ జరగనున్న వేళ అధికారులు ముందస్తు వ్యూహాలతో, తొక్కిసలాటకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లకు సిద్దమైయ్యారు.

185 సంవత్సరాలుగా ఉబ్బస వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్ లో బత్తిని సోదరులు చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. లక్షల మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో పోలీసులు పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకోవాలని లా అండ్ ఆర్డర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను ఏర్పాటు చేసినట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని సూచించారు. చేప ప్రసాదం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సర్వం సిద్దంకాబోతోంది.