
కాలువల్లో చెత్త కనబడితే చర్యలే
** ఆకస్మిక తనిఖీల్లో తిరుపతి మున్సిపల్ కమిషనర్
తిరుపతి: తిరుపతికి ప్రతిరోజూ లక్షల్లో వచ్చివెళ్లే యాత్రికుల సంక్షేమం, స్థానిక ప్రజల ఆరోగ్య భద్రతల దృష్ట్యా మురుగు కాలువల్లో ఎక్కడైనా చెత్త కనబడితే ఆ ప్రాంత సిబ్బందిపై చర్యలు తప్పవని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులకు హెచ్చరిక చేశారు. ఉదయం నగరంలోని ఎన్.జీ.ఓ కాలనీ, కపిలతీర్థం రోడ్డు, ప్రకాశం పార్క్ రోడ్డు, కె.టి.రోడ్డు తదితర ప్రాంతాల్లో అధికారులతో కలసి పారిశుద్ధ్య పనులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో చెత్త కుప్పలు ఉండడంతో సిబ్బందిని మందలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉదయాన్నే ప్రధాన రహదారుల్లో ముందుగా చెత్త కుప్పలు తొలగించాలని కోరారు. త్వరలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న పరిస్థితుల్లో మురుగునీటి కాలువల్లో ఎక్కడా చెత్త లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇండ్లలోని చెత్తను తమ కాలువల్లో వేయకుండా మీ ఇంటి వద్దకు వచ్చే సిబ్బందికి అందజేయాలని ప్రజలకు సూచించారు. కమిషనర్ వెంట తుడా ఈఈ.రవీంద్ర రెడ్డి, నగరపాలక సంస్థ డి.ఈ. వెంకట ప్రసాద్, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.
