TEJA NEWS

గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపండి! ..లోక్ సత్తా పార్టీ

తెనాలిలో గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఇకనైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్టమైన చర్యలను తీసుకొని నేరాలు జరగకుండా చూడాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు.
గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై రౌడీ షీటర్ అనుచరులు చేసిన దాడిని మాత్రమే డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంటే సరిపోదని, గంజాయి ఇతర మత్తు పదార్థాల వలన నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అనేక కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయని విషయాన్ని గుర్తించి, గంజాయి క్రయవిక్రయాలను జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలైనా వారు కుటుంబాలలో వృద్ధులైన తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యని చావబాదుతున్న సంఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. పోలీస్ స్టేషన్లో నమోదు అవుతున్న అధిక కేసుల్లోనూ, రోడ్డు ప్రమాదాల్లోనూ మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు సేవించడం వలన జరుగుతున్నాయి అనేది జగమెరిగిన సత్యం అని అన్నారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరి కట్టేందుకు పోలీసులు ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని భాను ప్రసాద్ కోరారు.
ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువతను సమన్వయం చేసుకొని వారిద్వారా సమాచారాన్ని సేకరించి మత్తు పదార్థాలను సరఫరా చేసే వారిపై ఉక్కు పాదాన్ని మోపాలని కోరారు.
గంజాయి, నార్కొటిక్‌ డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, వినియోగంపై నిఘా ఉంచి సంబంధిత వ్యక్తులపై కఠినచర్యలు చేపట్టాలని భాను ప్రసాద్ కోరారు.