
మంత్రి లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వ విద్యకు మోక్షం
** అన్ని పాఠశాలల్లో చెస్ శిక్షణ ఏర్పాటు
** పేరెంట్స్ మీట్ లో “తుడ” ఛైర్మన్ “డాలర్స్” దివాకర్
తిరుపతి: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యకు గడచిన ఐదేళ్ళలో పట్టిన గ్రహణానికి ఇప్పుడు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మోక్షం కలిగిందని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడ) చైర్మన్ “డాలర్స్” దివాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి కొర్లగుంటలోని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి దివాకర్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులు పట్టుదల, కృషితో చదివితే జీవితంలో ఉన్న స్థాయికి చేరుకోగలరని తెలిపారు. నేడు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలు మెండుగా ఉన్నాయని కొనియాడారు. అందుకు రాష్ట్ర టీడీపీ యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని గుర్తు చేశారు.
ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా యూనిఫామ్, షూలు అందిస్తున్నారని వెల్లడించారు. అలాగే ప్రతి విద్యార్థికి “తల్లికి వందనం” పథకం ద్వారా రూ.13,000 జమ చేయడం జరిగిందని చెప్పారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలు లేవని ప్రసంశించారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఈ స్థాయికి వచ్చానని డాలర్స్ దివాకర్ గుర్తు చేసుకున్నారు. చదువుతోపాటు ఆటపాటల్లో విద్యార్థులు రాణించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జీవితంలో కష్టాలను ఎదుర్కొనే శక్తి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. గురువులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల తెలివి తేటలను పెంచేందుకు త్వరలో ప్రతి పాఠశాలలో చెస్ క్రీడపై శిక్షణ ఏర్పాటు చేస్తామని… ఈ విషయాన్ని తాను విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకు వివరించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు తుడ తోపాటు తన వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని పాఠశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ రవిచంద్రన్, ఇన్చార్జ్ హెడ్మాస్టర్ రవికుమార్, పాఠశాల చైర్మన్ వాణి, ఇన్చార్జి చైర్మన్ రహంతుల్లా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
