
యుగం ఉన్నంతవరకు ఎన్టీఆర్ ను మరువలేము
** రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్
తిరుపతి: ప్రతి యుగంలోనూ కారణజన్ములు పుడతారని ఈ యుగానికి నందమూరి తారక రామారావు యుగపురుషుడని, ఆయన చేసిన మంచి పనులు, నాయకత్వ పటిమను యుగం ఉన్నంత వరకు మరిచిపోలేమని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని స్థానిక టౌన్ క్లబ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి రాయలసీమ రంగస్థలం కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు యుగపురుషుడని కొనియాడారు.
ఆయన రాజకీయాల్లోనూ, సినీ రంగంలోనూ తారా స్థాయికి ఎదిగి కోట్ల మంది ప్రజలకు ఆరాధ్య దైవమయ్యారని పేర్కొన్నారు. తెలుగు నాటక రంగానికి, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. వేల మంది కళాకారులకు ఆయన జీవితాన్ని ప్రసాదించారన్నారు. ఆయనను స్మరించుకోవడం ప్రతి కళాకారుడి బాధ్యతని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కే ఎన్ రాజా, ప్రతినిధులు విద్వాన్ కస్పా పద్మనాభన్, మల్లారపు రవి ప్రసాద్, నాగేశ్వరరావు, లోక, ప్రభాకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
