Spread the love

హౌసింగ్ సమస్యలు పరిష్కరించాలి : పద్మారావు గౌడ్ ఆదేశం
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో హౌసింగ్ స్కీం కు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ స్కీం ల పై శనివారం సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఓ సమీక్షా సమావేశం జరిగింది. లాలాపేట లోని చంద్ర బాబు నగర్ లో గతంలో నిర్మించిన ఇళ్ళు శిధిల స్థితికి చేరిన పరిస్థితి పై పద్మారావు గౌడ్ అధికారుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. అపాయకరంగా ఉన్న ప్రాంగణాల్లో ప్రజలు నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయి నగర్ లో నిర్మాణం పనుల్లో జాప్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదే విధంగా మరాఠా బస్తీ లో కొత్త ఇళ్ళను నిర్మించాలని, దోభీ ఘాట్, సుబాష్ చంద్ర బోస్ నగర్, ఆజాద్ చంద్ర శేఖర్ నగర్ లలో లబ్దిదారులకు ఇళ్ళు కేటాయించాలని సూచించారు. హమాలి బస్తీ లో వివాదాలు పరిష్కరించాలని, శాస్త్రి నగర్, లబ్ది బస్తీల్లో శిధిల స్థితి చేరిన భవనాల పునర్నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. సికింద్రాబాద్ హౌసింగ్ సెల్ ఏ.ఈ. క్రాంతి, అధికారులు మల్లికార్జున్, కార్పొరేటర్లు సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కంది శైలజ, రాసురి సునీత రమేష్ తదితరులు పాల్గొన్నారు.