
బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్న ప్రజా ప్రభుత్వం.
మొదటి ప్రాధాన్యతలో మేరు కులస్తులు..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య .
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం బలహీన వర్గాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి బీర్ల అయిలయ్య గారు ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ పథకానికి ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ పథకంలో ముఖ్యంగా మేర కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 మంది చొప్పున మొత్తం 1,19,000 మంది మహిళలకు ఈ కుట్టు మిషన్లను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. 100 శాతం సబ్సిడీతో ఒక్కో ఆటోమేటిక్ కుట్టు మిషన్కు రూ.12,000 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెట్రోల్ పంపులు, ఇందిరా క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు తదితర కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని, అదే విధంగా బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ల పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని బీర్ల అయిలయ్య అన్నారు.భవిష్యత్లో ఈ పథకాన్ని మరింత విస్తరించి మహిళలకు అదనపు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
మార్నింగ్ వాక్ ద్వారా ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మార్నింగ్ వాక్ కార్యక్రమాల ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి కుటుంబాలను సందర్శిస్తున్నారని బీర్ల అయిలయ్య తెలిపారు. ప్రజల సమస్యలు, అవసరాలను తెలుసుకుని వారికి అర్హత ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను గుర్తించి, దరఖాస్తులు నమోదు చేసి సంబంధిత అధికారులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల ఉచిత రక్త పరీక్షలు.
తెలంగాణ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా 30 రకాల రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని బీర్ల అయిలయ్య తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మొదటగా ఆలేరు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగిందని ఆయన వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉచిత రక్త పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.
SIR కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రథమ స్థానం.
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని బీర్ల అయిలయ్య తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన BLOలు, వారికి సహకరించిన BLAలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.