
“పొగాకు అలవాటుకు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోండి”….
పొగాకు రహిత సమాజమే లక్ష్యం – ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పొగాకు రహిత సమాజమే లక్ష్యం – ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా ఆసుపత్రి ఆవరణ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తుల వినియోగం, ధూమపానం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు.
పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, పొగాకు నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రతి సంవత్సరం మే 31న. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన 2026 సంవత్సరపు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అంశం “ఆకర్షణను బహిర్గతం చేయడం: నికోటిన్, పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం” అని పేర్కొన్నారు.
పొగాకు ఉత్పత్తుల నియంత్రణ చట్టం–2003 అమలులో భాగంగా బహిరంగ ప్రదేశాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విద్యాసంస్థల పరిసరాల్లో ధూమపానం చేయడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించబడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్సీడీ కార్యక్రమ అధికారి డాక్టర్ రాజమౌళి, భారత రెడ్క్రాస్ సంఘం అధ్యక్షులు రాజగోపాల్, కార్యవర్గ సభ్యులు వి. శ్రీనివాస్, వైద్యాధికారులు డాక్టర్ శ్రవణ్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ స్పూర్తి, డాక్టర్ సౌమ్య, కార్యక్రమ సమన్వయకర్తలు టి. రాజేశ్, మధుసూదన్, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.