
చిలకలూరిపేటకు రైల్వేలైన్ అత్యవసరం చిలకలూరిపేట రైల్వేలైన్ ఏర్పాటుపై శాసనమండలి లో ప్రస్తావిస్తా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …
చిలకలూరిపేటలో రైల్వేలైన్ అత్యవసరమని, ఈ దిశగా రానున్న శాసనమండలి సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ రైల్వే లైన్ సాధన సమితి కమిటీకి హామీ ఇచ్చారు. రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు మర్రి రాజశేఖర్ ని మరి నివాసంలో కలసి చిలకలూరిపేట రైల్వే లైన్ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా మర్రి రాజశేఖర్ స్పందిస్తూ ఈ ప్రాంతానికి రైల్వేలైను ఏర్పాటు చేయాలని గతం నుంచి ఎన్నో ప్రయత్నాలు కొనసాగాయని, దశాబ్దాల కిందటే నాటి చిలకలూరిపేట శాసనసభ్యులు స్వర్గీయ సోమేపల్లి సాంబయ్య ఆనాటి గుంటూరు పార్లమెంటు సభ్యులు ఆచార్య ఎన్జీ రంగా దృష్టికి రైల్వే లైన్ ఆవశ్యకతను గురించి తీసుకువెళ్లారని గుర్తు చేశారు.రైల్వేలైన్ వల్ల చిలకలూరిపేటతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.చిలకలూరిపేటలోని స్పిన్నింగ్ మిల్లులు, పొగాకు పరిశ్రమ, బాపట్ల జిల్లా పర్చూరు, మార్టూరు గ్రానైట్ పరిశ్రమల నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆయ్యే ఆవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.స్థానికంగా ఉన్న స్పిన్నింగ్, ఆయిల్ మిల్లులు తమ సరుకులను దూరప్రాంతాలకు రవాణా చేయడానికి ఏటా సుమారు రూ. 100 కోట్లు పైబడి వెచ్చిస్తున్నారని, స్థానికంగా ఉన్న పలు పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు ఇతరా రాష్ట్రాలకు చెందిన వారే. వారి ప్రయాణ సౌకర్యానికి రైల్వేలైను ఎంతో ఆవసరమని తెలిపారు.దీంతో పాటు పర్యాటక రంగం ఆభివృద్ధి చెందుతున్న దృష్ట్యా కొండవీడు వంటి చారిత్రక ప్రదేశాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు చేరుకోవడానికి ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని వెల్లడించారు.
ఈ సందర్బంగా రైల్వేలైన్ సాధన సమితి కన్వీనర్ షేక్ సుబాని మాట్లాడుతూ చిలకలూరిపేటకు రైల్వేలైన్ ఏర్పాటు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్చంధ సంస్థలు, ప్రజా సంఘాల నాయకులు, పారిశ్రామికవేత్తలు సైతం సంఘీభావం ప్రకటించారని వెల్లడించారు. ఈ అంశంపై ముందడుగు పడాలంటే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైల్వేలైన్ సాధన కోసం కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై ప్రజలు కలిసి రావాలని, స్వచ్చంధంగా మద్దతు తెలిపి రైల్వేలైన్ సాధన కోసం జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు , మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల , ఎమ్మార్పీఎస్ నాయకులు అడపా మోహన్మాదిగ , ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు షేక్ బాజి , జనక్రాంతి పార్టీ నాయకులు గౌస్ తదితరులు పాల్గొన్నారు.
