
కేటీఆర్కు రాజాసింగ్ మాస్ వార్నింగ్
హైదరాబాద్, : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. పోలీసు శాఖతో పెట్టుకోవద్దని మాజీ మంత్రిని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశంతో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. ఏకంగా రేవంత్ రెడ్డి బెడ్రూమ్లోకి చొచ్చుకెళ్లి మరీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా.. ఆ సమయంలో తనను అరెస్ట్ చేసిన వారిని ఏమీ చేయలేదని తెలిపారు. కానీ ‘మేము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం’ అని ఇప్పుడు కేటీఆర్ అంటున్నారని.. పోలీసు శాఖతో పెట్టుకోవద్దు అంటూ మాజీ మంత్రికి ఎమ్మెల్యే మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు చెప్పిన విధంగా పోలీసులు లీగల్గానే పనిచేస్తారని… ఆ విషయం మర్చిపోయారా కేటీఆర్ అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టి పోలీసులు జైలుకు పంపిస్తున్నారని… బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్కు చూశారన్నారు. తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు కూడా పంపించారని రాజా సింగ్ గుర్తుచేశారు. అయితే ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే.. తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించే సమయంలో సొంత పార్టీ నేతలు, కొంతమంది బీజేపీ అధికారులు.. పోలీసులకు మద్దతుగా నిలిచారన్నారు. ఈ విషయాన్ని ఓ పోలీస్ అధికారే స్వయంగా తనతో చెప్పారన్నారు. ‘రాజాసింగ్ ! నీ పైన పీడీ ఆక్ట్ వేస్తున్నాం. మీ బీజేపీ వాళ్లు కూడా వేయండి అన్నారు’ అని చెప్పినట్లు తెలిపారు.
అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. తనను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను, బీజేపీ అధికారులను ఏం చేయాలని ప్రశ్నించారు. ఇప్పటి కూడా తమ పార్టీలోని అధికారులే తనను వెన్నుపోటు పొడవాలనే ఆలోచనలో ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను జైల్లో ఉన్న సమయంలో నా వెంట నా అన్నగారు ఉన్నారు. మా కార్యకర్తలు నిలిబడ్డారు. ఈరోజు కూడా నా అన్న నా వెంటే ఉన్నారని నేను అనుకుంటున్నా.. కానీ మా అన్న ఎటువైపు ఉన్నారో మాకు అర్థం కావడం లేదు’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు..
