TEJA NEWS

స్విమ్స్ అభివృద్ధికి వెనుకాడేది లేదు

** స్విమ్స్ నిర్మాణ భవనాల పరిశీలనలో టీటీడీ ఈవో

తిరుపతి: స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ముద్దుబిడ్డలా…. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మకంగా….. టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్(బి.ఆర్) నాయుడు ఆశయ సౌదంగా వెలుగొందుతున్న స్విమ్స్ మెడికల్ యూనివర్సిటీ, ఆస్పత్రుల అభివృద్ధిలో వెనుకాడే పరిస్థితే లేదని టీటీడీ ఈఓ శ్యామల రావు స్పష్టం చేశారు. స్విమ్స్ లో నిర్మాణంలో ఉన్న భవనాలను ఈవో అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ముందుగా రోగుల సహాయక వసతి గృహంలోని రోగులు వేచియుండే గదులు, భోజనశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. అక్కడే వున్న రోగులతో అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. స్విమ్స్ అందిస్తున్న వైద్య సేవలపై రోగులు సంతోషం వ్యక్తం చేశారు. రోగులు ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఎలాంటి వైద్యం కోసం వచ్చారు తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు.


అనంతరం కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సిటి సర్జరీ తదితర వైద్య సేవల కోసం నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనంలో ఏఏ శాఖను ఏర్పాటు చేస్తారు, సదరు శాఖను నూతన భవనంలోకి తరలిస్తే, అప్పటి వరకు ఉన్న పాత భవనాన్ని ఏ శాఖకు కేటాయిస్తారనే విషయాలను క్షుణ్నంగా పరిశీలించాలన్నారు. ఇన్ పేసెంట్స్ రెనోవేషన్ బ్లాక్ ను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటు తర్వాత సెంట్రల్ కిచెన్, సెంట్రల్ మెడికల్ స్టోర్స్ భవనాలను, స్విమ్స్ పద్మావతీ ఆసుపత్రిని, నిర్మాణంలోని క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ , స్టాఫ్ క్వార్టర్స్ ను, శ్రీపద్మావతీ చిన్నపిల్లల హృదయాలయం భవనాలను పరిశీలించారు. నిర్మాణంలోని భవనాలు, మౌళిక సదుపాయాలు, పరికరాల వివరాలు, తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ ప్రొ. ఆర్వీ కుమార్, మెడికల్ సూపరింటెండ్ డా. రామ్, ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, టీటీడీ సీఈ టివి సత్యనారాయణ, ఎస్.ఈలు వెంకటేశ్వర్లు, మనోహరం తదితర అధికారులు పాల్గొన్నారు.