
ఈ చిత్రంలో ఎస్సైగా యూనిఫాంలో ఉన్న యువతి పేరు జబీనాబేగం. పక్కన నిలబడింది అదే స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న లాల్యానాయక్. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? వీళ్లిద్దరూ గురుశిష్యులు కావడం, ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్న విద్యార్థిని ఎస్సైగా.. తాను కానిస్టేబుల్ గా పనిచేసే స్టేషన్ కి రావడం ఇందులో ప్రత్యేకత. ఇద్దరూ పేదరికం అనే అడ్డంకులను దాటుకుని ఆయా స్థానాలకు చేరుకోవడం మరింత ప్రత్యేకం.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత్ లాల్యానాయక్ నిరుపేద కుటుంబం. తండ్రి నాలుగో తరగతిలో పరిగిలోని ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించడంతో అక్కడే ఉంటూ ఇంటర్ పూర్తిచేశారు. తర్వాత పాల్వంచలో డిగ్రీ పూర్తిచేసిన ఆయన..ఎంఏ, బీఎడ్ పూర్తిచేసి పరిగిలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా చేరారు. కొవిడ్ సమయంలో కళాశాల మూతపడటంతో ఉపాధి కోల్పోయారు. పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమై..2020లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసుస్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.
లాల్యానాయక్ లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో నిరుపేద కుటుంబ నేపథ్యం ఉన్న అదే జిల్లాలోని మక్తా వెంకటాపూర్ గ్రామానికి చెందిన జబీనాబేగం ఇంటర్ లో చేరారు. చదువులో చురుగ్గా ఉండటంతో లాల్యానాయక్ ఆమెను ప్రోత్సహించారు. ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆమెకు వివాహం జరిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకుని.. వారితో మాట్లాడి రద్దు చేయించారు. ఇంటర్ తోపాటు డిగ్రీ చదివేవరకు అండగా నిలిచారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకూ చేదోడుగా ఉన్నారు. గురువు ప్రోత్సాహానికి స్వయం కృషిని జోడించిన జబీనాబేగం 2024లో ఎస్సై పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఏడాది శిక్షణ పూర్తి చేసుకుని ఎస్సైగా (ప్రొబేషన్) మొయినాబాద్ పోలీసుస్టేషన్ లో పోస్టింగ్ పొందారు. తన శిష్యురాలు బుధవారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్నట్టు తెలుసుకున్న లాల్యానాయక్..జబీనాబేగంకు ప్రధాన ద్వారం వద్ద సెల్యూట్ చేసి స్వాగతం పలికారు.
