
ఏప్రిల్ 1నుండి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ……… అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
వనపర్తి
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన సన్న బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించిందని, ఆ దిశగా రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆదేశించారు.
రేషన్ దుకాణాలలో సన్నబియ్యం సరఫరా అంశంపై సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రేషన్ డీలర్లు, పౌరసరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన సన్న బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించిందని, ఆ దిశగా రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొడ్డు బియ్యం పంపిణీ చేయవద్దని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం పంపిస్తున్న ఈ సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు మాత్రమే అందేలా చూడాలన్నారు. సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు.
ఇదివరకే రేషన్ డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యం స్టాకును తమ వద్ద ఉంచుకోవాలని, దానికి సంబంధించి తదుపరి సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా, ఎమ్ ఎల్ ఎస్ పాయింట్ నుంచి డీలర్ల సమక్షంలో మాత్రమే బియ్యం సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాల డిఎం జగన్, డీటీలు, రేషన్ డీలర్ల సంఘం నాయకులు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
