
ఫ్యాషన్ గా మొదలయ్యే పొగాకు ప్రాణాంతకం అవుతోంది
** స్విమ్స్ లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సదస్సు
తిరుపతి: యువత చదువుకునే వయసులోనే ఫ్యాషన్ గా అలవాటు చేసుకునే పొగాకు పీల్చడం చివరకు ప్రాణాంతకంగా మారుతోందని తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) డైరెక్టర్ డాక్టర్ ఆర్. వి. కుమార్ తెలిపారు. శ్రీ పద్మావతి హాస్పిటల్ లోని మెడిసిన్ విభాగంలో శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సదస్సు నిర్వహించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.రామ్ తెలిపారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ ఆర్.వి.కుమార్, మెడికల్ వర్సిటీ డీన్ అండ్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్.బిట్లా, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ సంయుక్తంగా జ్యోతిని వెలిగించి. కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి సమన్వయ కర్తగా మెడిసిన్ విభాగాధిపతి అల్లాడి మోహన్ వ్యవహరించారు.
పొగాకు సేవించడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ రోజు స్విమ్స్ లో పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచంలో ఆర్థికంగా బలమైనది పొగాకు వ్యాపారమని, మనిషి జీవితంలో ఈ పొగాకు వాడకం మొదటిలో ఫ్యాషన్ తో మొదలయ్యి తరువాత వదలలేని మానసిక స్థితికి వచ్చి బలౌతున్నారని పేర్కొన్నారు. దీని పర్యవసా నంగా ఊపరితిత్తులు పాడై పోవడం… గుండె జబ్బులు, పక్షవాతం, రక్తప్రసరణ ఆగిపోవడంతో క్యాన్సర్ వస్తాయని హెచ్చరించ్చారు. అదే విధంగా శరీరంలోని ఇతర బాగాలకు సోకి మనిషి చనిపోయే ప్రమాదం వుందని అందువల్ల పొగాకుకు దూరంగా ఉండాలని కోరారు. మెడిసిన్ విభాగాధిపతి డా॥ అల్లాడి మోహన్ మాట్లాడుతూ*, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం పొగాకు వినియోగం కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 80 లక్షల మంది మృత్యువు బారిన పడుతున్నారని తెలిపారు. ఇందులో సుమారు 13 లక్షల మంది ధూమపానం చేయకపోయినా గాలిలోని పొగ పీల్చడం వల్ల చనిపోతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా పొగాకు వల్ల జరిగే నష్టాలపై మెడిసిన్ విభాగపు వైద్యులతో చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. హరికృష్ణ పొగాకు వినియోగించడం వల్ల జరిగే అనర్థాలు గురించి, మనోలాస్య గర్భిణీ స్త్రీలు పొగాకు ఉత్పత్తుల ప్రభావానికి గురికావడం వల్ల కలిగే అనార్థాల గురించి,
సమీరజ ధూమపానం మానేసిన తరువాత శరీరంలో వచ్చేటువంటి మార్పులు వాటి నివారణ గురించి, భార్గవ్ ధూమపానం వల్ల ఇతర జబ్బులపై కలిగే ప్రభావం గురించి, చంద్రశేఖర్ పొగత్రాగే అలవాటును మానేందుకు ఉపయోగపడే వనరులు గురించి విశదీకరించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, చీఫ్ పీఆర్వో రాజశేఖర్, మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ కోబాకు భూపాల్, పీఆర్వో సిబ్బంది అమర్, సుందర్, గణేష్, సుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు.
