Spread the love

తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని నియమించేది ఎప్పుడు?

విద్యారంగాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.

విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.

- ఎర్ర అఖిల్ కుమార్ పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు

         తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యారంగానికి కనీసం ఓ ప్రత్యేక శాఖను నియమించకుండా జాప్యం చేస్తూ విద్యారంగాన్ని గాలికి వదిలేసి కేసిఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నాడని పిడియస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ లో పిడియస్యూ ఆధ్వర్యంలో విలేఖర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ  రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది అని ఎటువంటి పట్టింపులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నది అని కాంగ్రెస్ ప్రభుత్వం పై ద్వజమెత్తారు. ఒకపక్క గురుకుల విద్యాలయాల లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు మరణిస్తుంటే మరోపక్క ప్రభుత్వ విద్యాసంస్థలన్నీంటిలో  అర కొర సౌకర్యాలు,అధ్యాపకుల లేమి, మంచినీరు సమస్య, సరిపోనీ తరగతి గదులు, శిధిలావస్థలో బిల్డింగులు, అద్దె భవనాల్లో విద్యాసంస్థల నిర్వహణ లాంటి లోపాలతో ప్రభుత్వ విద్యా సంస్థలు కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వ చేయూత ఏమాత్రం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ విద్యాసంస్థల నిర్వహణకు ఉద్యోగుల జీతపత్యాలకు కూడా సరిపోని స్థితి ఉందన్నారు.ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే కొత్త సీసాలో పాత సార చందంగా విద్యార్థులకు పాత సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు తోడై స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. అంతేకాకుండా సంవత్సరాల తరబడి స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయకుండా వేల కోట్ల రూపాయలను పెండింగ్ లో ఉంచి విద్యార్థులకు మొండి చేయి చూపిస్తున్నారని తెలిపారు. విద్యారంగంలో కొంతమేరకైనా సమస్యలు పరిష్కరించబడాలి అంటే కొఠారి కమిషన్ సూచించిన మేరకు రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల చిత్తశుద్ధి చాటుకోవాలని వారి డిమాండ్ చేశారు.విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల నూతన ముసాయిదాను ప్రవేశపెట్టి వీసీల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులను వైస్ ఛాన్స్లర్ గా నియమించి విశ్వవిద్యాలయాలలో హిందుత్వ  ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కుట్రలో భాగంగానే నూతన ముసాయిదాను తీసుకొచ్చిందని దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించి చేతులు దులుపుకోవడం కాకుండా అడ్డుకోవాలని వారు సూచించారు.రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించి,విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల పిడిఎస్యు అధ్వర్యంలో రేపటి నుండి పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు మాతంగి విజయ్, వంటికొమ్ము నగేష్, సాయి కిరణ్, నితిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.