TEJA NEWS

జనభేరి విజయంతో… జిల్లా అభివృద్ధిలో మరింత ఉత్సాహంతో పనిచేస్తాం

సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు

—- బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి :
సమస్యల పరిష్కారం… హక్కుల సాధన కోసం నిర్వహించిన జనభేరి బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు.

వనపర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బుదవారం నిర్వహించిన జనభేరి సభ సక్సెస్ వెనుక బీసీ పొలిటికల్ జేఏసీ నాయకుల సమిష్టి కృషి దాగి ఉందన్నారు.

సభను విజయవంతం చేయాలని కేవలం ఒక్క పిలుపు ఇవ్వడంతో జిల్లా నలుమూలల నుంచి దాదాపు 20 వేల మంది స్వచ్ఛందంగా తరలివచ్చారని, దీంతో మాపై బాధ్యత పెరిగిందని, మరింత ఉత్సాహంతో పనిచేస్తామన్నారు.

బీసీ పొలిటికల్ జేఏసీకి ఆడపడుచుల అండదండలు మెండుగా ఉన్నాయని అనడానికి నిన్న జరిగిన జనభేరి సభ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.

రాజకీయ పార్టీలకు గ్రామస్థాయి నుంచి ఒక పటిష్టమైన వ్యవస్థ, క్యాడర్, ఉంటుందని, అలాంటి పార్టీలకు దీటుగా జనభేరి సభ విజయవంతం కావడం వెనుక జిల్లా ప్రజలకు మాపై ఉన్న నమ్మకాన్ని గుర్తుగా సూచిస్తుందన్నారు.

కొద్దిమందితో ప్రారంభమైన బీసీ పొలిటికల్ జేఏసీ నేడు ఒక వ్యవస్థగా మారిందన్నారు.

మేము జనభేరి సభ ద్వారా ప్రజల ముందు పెట్టిన డిమాండ్లను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపు పరిష్కరించాలని, లేదంటే బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి, వారిని గెలిపించుకుని సమస్యలు కూడా మేమే పరిష్కరించుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగ యాదవ్, ఆర్టీఐ విభాగం ఉపాధ్యక్షులు రాఘవేందర్, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న యాదవ్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కొత్తకోట మండల అద్యక్షుడు అంజన్న యాదవ్, మదనాపూర్ మండల అధ్యక్షుడు మహేందర్ నాయుడు, ఆత్మకూరు మండల ప్రధాన కార్యదర్శి అక్కల మల్లేష్ గౌడ్, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షుడు ధర్మేందర్ సాగర్, ప్రధాన కార్యదర్శి అస్కని రమేష్, మ్యాదరి రాజు తదితరులు పాల్గొన్నారు.