TEJA NEWS

హైదరాబాద్‌: బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ) కె.జగజ్యోతి అవినీతి నిరోధకశాఖ(అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. గంగన్న అనే కాంట్రాక్టర్‌కు నిజామాబాద్‌లో పూర్తిచేసిన పనికి బిల్లు మంజూరవ్వగా.. హైదరాబాద్‌ శివార్లలోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జువైనల్‌ బాలుర వసతిగృహం కాంట్రాక్టునూ ఆయనే దక్కించుకున్నారు. నిజామాబాద్‌లో పూర్తయిన పనికి బిల్లులు మంజూరు చేయడం, గాజుల రామారం పనికి అంచనాలు సవరించేందుకుగాను జగజ్యోతి లంచం డిమాండు చేశారు. దీనిపై కాంట్రాక్టర్‌ గంగన్న అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అనిశా అధికారులు మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో రూ.84 వేలు లంచం తీసుకుంటున్న జగజ్యోతిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్‌ఛార్జి హోదాలో ఎస్‌ఈ బాధ్యతలూ నిర్వర్తిస్తుండటం గమనార్హం.


TEJA NEWS