దిల్లీ: బిహార్లో రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ సభ కోసం ఏర్పాటుచేసిన వేదిక కూలిపోయింది. దీంతో ఆయన బస్సు పైకప్పుపై నిల్చొని జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జన్ విశ్వాస్ యాత్రలో భాగంగా బిహార్లోని సీతామర్హిలో ఏర్పాటుచేసిన సభలో రిగా మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిత్ కుమార్ తున్నా సభను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. అప్పటికి తేజస్వీ సభకు ఇంకా చేరుకోలేదు. వేదిక పైకి ఎక్కువ మంది కార్యకర్తలు ఎక్కడంతో అది కూలినట్లు సమాచారం. సభ అనంతరం ‘‘మీ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకోగలను. నాపై భరోసా ఉంచండి. సీతామర్హిలో గుమిగూడిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.’’ అని తన ఎక్స్లో పోస్టు చేశారు.
తేజస్వీయాదవ్ ‘జన్ విశ్వాస్ యాత్ర’లో భాగంగా మొదటి బహిరంగ సభ ముజఫర్పూర్లో నిర్వహించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమార్కు రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించిన ఆలోచన లేదని విమర్శించారు. మమ్మల్ని విడిచిపెట్టి ఎన్డీఏలోకి తిరిగి వెళ్లడానికి అతని వద్ద సరైన కారణం కూడా లేదని మండిపడ్డారు.
అనంతరం సభను సీతామర్హిలో ఏర్పాటుచేశారు. నేడు షియోహార్ను కూడా సందర్శించనున్నారు. రాత్రి బస మోతిహారిలో చేస్తారు. 11 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో తేజస్వీ రాష్ట్రంలోని 38 జిల్లాల్లోను పర్యటించనున్నారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-21-at-7.46.43-AM-1024x885.jpeg)