TEJA NEWS

కేటీఆర్.. రెచ్చగొట్టకు.. సీఎం రేవంత్ ఆగ్రహం!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజూ హాట్ హాట్‌గానే సాగుతున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా.. అది కాస్త ఎక్కడెక్కడికో పోయింది. కాసేపు మంత్రులు వర్సెస్ కేటీఆర్‌గా పరిస్థితులు నడవగా.. మరికొద్దిసేపు సీఎం రేవంత్ రెడ్డి-కేటీఆర్‌ల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో ఒకింత ఆగ్రహానికి లోనైన ముఖ్యమంత్రి.. కేటీఆర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి అని హెచ్చరించారు!

అసలేం జరిగింది..?

‘ఫార్మా సిటీ భూములు వెనక్కి ఇస్తామని హామీ ఇచ్చారు.. చేయండి. మూసీని లండన్ చేస్తాం అంటున్నారు.. చేయండి. మూసీ సుందరీకరణను స్వాగతిస్తున్నాము. రూ.16వేల కోట్లతో మేము ప్రతిపాదనలు సిద్దం చేశాం. కానీ ఇప్పుడు లక్షన్నర కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఎందుకు ప్రతిపాదన పెరిగిందో డీపీఆర్ సబ్మిట్ చేయాలి..?’ అని అసెంబ్లీ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మాట్లాడిన ప్రతి విషయంపైనా సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజిలో స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.

కుట్ర ఏంటి..?

‘ కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మోసం అనే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. పదేళ్లు ఏలిన మీరు పది నెలలు నిండని ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. బతుకమ్మ పథకాన్ని ప్రారంభించిన ఏడాది సిరిసిల్లలో నేతన్నలు ఆ చీరలు నేశారా?. మీ బినామీలకు కాంట్రాక్టు ఇచ్చి సూరత్ నుంచి తూకంలో తెచ్చారా?. కమిషన్లు కొట్టి పేదలను మోసం చేశారా.. లేదా?. ఎంఎంటీస్‌ను ఎయిర్ పోర్ట్‌లోనికి ఎందుకు అనుమతి ఇవ్వలేదు..? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి?. ముచ్చర్ల భూ సేకరణపై వారే ఊహించుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా మారుస్తానని మీలా నేనెప్పుడూ అబద్ధాలు చెప్పలేదు’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధిస్తూ కన్నెర్రజేశారు.

కేటీఆర్ సవాల్..

కాగా.. అంతకుముందు కేటీఆర్ వర్సెస్ మంత్రుల మధ్య మాటల యుద్ధం సాగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో కోతలు, ఎగవేతలతో మసిబూసి మారేడుకాయ చేశారు. రైతు భరోసాకు బడ్జెట్ ఏదని ప్రశ్నించారు. పెన్షన్ డబుల్ చేసే కేటాయింపులు ఎక్కడని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు ఎన్నికల ముందు రజినీకాంత్, తర్వాత గజినీకాంత్‌లా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాటాల గడ్డ.. మభ్యపెడితే ఊరుకోదని కేటీఆర్ అన్నారు. చార్జిషీట్లు, రికవరీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయాలన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్ ఒకటి విసిరారు. అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి వెళదామని.. ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చినట్లు యువకులు చెబితే అక్కడే రాజీనామా చేయడమే కాదు.. రాజకీయ సన్యాసం చేస్తానంటూ కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. పైగా రేవంత్, భట్టికి పౌర సన్మానం కూడా చేస్తామని తెలిపారు.

కౌంటర్లే కౌంటర్లు!

ఈ క్రమంలోనే మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు ఒక్కొకటి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. మేము చేయకపోతే ప్రజలే మాకు బుద్ది చెబుతారన్నారు. కొంచెం ఓపికగా ఉండాలని తెలిపారు. దీనికి తిరిగి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఓపికగా ఉండాల్సింది మంత్రులు అని.. తాము కాదని కేటీఆర్ పేర్కొన్నారు. వంద రోజులలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ఎవరు చెప్పమన్నారని ప్రశ్నించారు. పోస్టులు పెంచమంటే పోలీసులతో దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. సన్నాసులు గ్రూప్ 2 వాయిదా వేయమంటున్నారని సీఎం రేవంత్ అవమానిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. జీవో 46సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సత్యదూరంగా మాట్లాడుతున్నారని.. బీఆర్ఎస్ కూడా మాకు పోటీగా హామీలు ఇచ్చిందన్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదన్నారు. కాంగ్రెస్ తోనే మార్పు సాధ్యం అని ప్రజలు నమ్మారన్నారు. మమ్మల్ని గెలిపించారని.. మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. దళితుడిని సీఎం చేస్తామని చెప్పి ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. వారికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు ఉందా? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మొదటి బడ్జెట్‌కే ఇంత భయపడితే.. మరో నాలుగు బడ్జెట్‌లు ప్రవేశ పెడితే ఎంత భయపడతారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు

Print Friendly, PDF & Email

TEJA NEWS