
ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్ తేజస్
ఉమ్మడి నల్గొండ జిల్లా
ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 29, 35, 36, 42 వార్డుల్లో ఎన్యుమరేషన్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరికి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి, వివరాలను పూర్తిగా నమోదు చేయించాలని సూచించారు. ప్రతి రోజు కనీసం 2,500 ఫారాలను సేకరించే లక్ష్యంతో పనిచేసి, పెండింగ్లో ఉన్న ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఓటర్లు సకాలంలో ఫారాలు పూర్తి చేసి అందజేసేలా అవగాహన కల్పించాలని, ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు నింపించడంతో పాటు ఓటర్ల సంతకాలను తప్పనిసరిగా పరిశీలించాలని, ఓటర్ల మ్యాపింగ్ను ఖచ్చితంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణు మాధవరావు, తహసీల్దార్ సాయి గౌడ్, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.