
వేధింపులు సహించవద్దు, షీ టీమ్స్ను ఆశ్రయించండి…
ఉపాధి హామీ కూలీలకు మహిళల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీమ్ పోలీసులు…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు కాసిపేట మండలంలోని కాసిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మహిళల భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఈవ్టీజింగ్, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ నియమాలు, టీ-సేఫ్ యాప్ వినియోగం, షీ టీమ్స్ సేవలపై అవగాహన కల్పించారు.
మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385లకు సమాచారం అందించాలని తెలిపారు.
ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్తో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.