
ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ఆదేశాలు….
గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఎం. రమేష్ వార్షిక తనిఖీలు…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: వార్షిక తనిఖీల్లో భాగంగా గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఏసీపీకి వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఏసీపీ ముందుగా పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడి రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు, రికార్డులను పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది, వారు నిర్వహిస్తున్న విధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ సిబ్బందితో మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్లో 5S, ఫంక్షనల్ వర్టికల్స్ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు.
వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త వ్యక్తులు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, పట్టణంలోని ముఖ్య ప్రాంతాల్లో పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, డయల్-100కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు.
స్టేషన్ పరిధిలో బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాల ద్వారా పకడ్బందీగా గస్తీ నిర్వహిస్తూ నేరాలను నియంత్రించాలని తెలిపారు. ముఖ్యంగా తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
సిబ్బంది అందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందడంతో పాటు పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రోజువారీ వాహన తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్లపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. అదేవిధంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమ నిబంధనలు, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రమేష్, మనోహర్, అనూష తదితర సిబ్బంది పాల్గొన్నారు.