
సూపర్ ఎల్-నినోపై రైతులు అప్రమత్తంగా ఉండాలి…
శాస్త్రీయ సాగు పద్ధతులు అనుసరించాలి…
— కలెక్టర్ కోయ శ్రీహర్ష…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
సూపర్ ఎల్-నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అప్రమత్తంగా ఉంటూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. వాతావరణ నిపుణుల సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా పంటల వైవిధ్యీకరణ, ఎల్-నినో ప్రభావాలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ, గత నెల 4వ తేదీ నుంచి నిర్వహించిన గ్రామసభల్లో రైతులకు సూపర్ ఎల్-నినో పరిస్థితులు, వాటి ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ, వాతావరణానికి అనుగుణమైన వ్యవసాయ పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించినట్లు తెలిపారు.
గ్రామ సర్పంచ్లతో నిర్వహించిన సమావేశాల్లో కూడా ఎల్-నినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి రైతు వేదికలో క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నేటి నుంచి చిన్న రైతు బృందాల స్థాయిలో కూడా పొలాల్లోనే ప్రత్యక్షంగా రైతులకు సూచనలు అందిస్తున్నామని వెల్లడించారు.
జిల్లాలోని అన్ని మండలాలు, క్లస్టర్లలో ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు