
రైతులకు ఊరట.. జూలై 16 నుంచి మూసీ ప్రాజెక్ట్ కాలువలకు సాగునీటి విడుదల
సాక్షిత న్యూస్ ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో
ఖరీఫ్ సీజన్-2026కు సంబంధించి మూసీ ప్రాజెక్ట్ కాలువల ద్వారా సాగునీటి విడుదల షెడ్యూల్ను సూర్యాపేట ఇరిగేషన్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రకటించారు. ఈ మేరకు జూలై 16 నుంచి దశలవారీగా రైతులకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత (1st Wetting)లో జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 20 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఈ విడతకు 1.091 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు పేర్కొన్నారు. తొలి విడత అనంతరం ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు 15 రోజుల గ్యాప్ పీరియడ్ ఉండనుంది. అనంతరం ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 4 వరకు రెండో విడత (2nd Wetting)లో 15 రోజుల పాటు సాగునీటిని విడుదల చేస్తారు.
దీనికి 0.792 టీఎంసీల నీరు వినియోగించనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 19 వరకు మరో 15 రోజుల గ్యాప్ పీరియడ్ కొనసాగుతుంది. అనంతరం సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు మూడో విడత (3rd Wetting)లో 15 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఈ విడతకు 0.771 టీఎంసీల నీరు అవసరమని షెడ్యూల్లో పేర్కొన్నారు. మొత్తం 80 రోజుల ప్రణాళికలో 2.819 టీఎంసీల నీటిని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో +640.92 అడుగుల నీటిమట్టం వద్ద నికరంగా 3.098 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని అంచనా వేశారు. అలాగే, నాలుగో విడత సాగునీటి విడుదల ప్రాజెక్టులో అందుబాటులో ఉండే నీటి నిల్వలను బట్టి నిర్ణయిస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పష్టం చేశారు. ఈ షెడ్యూల్ ప్రకటనతో మూసీ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రైతులు నీటి వినియోగాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించి పంటల సాగును విజయవంతం చేసుకోవాలని సాగునీటి శాఖ అధికారులు సూచించారు.