
ఉపాధి కూలీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట….
— ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, పాలకుర్తి, కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలతో మమేకమై వారి పని పరిస్థితులు, అవసరాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు వారి ఆర్థిక స్థితిని మెరుగుపర్చేందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తీవ్ర ఎండల నేపథ్యంలో ఉపాధి కూలీలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు కూలీలకు టోపీలు, గ్లూకోవిటా పంపిణీ చేసి వారి సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మక్కన్ సింగ్ సేవ సమితి చైర్మన్ మనాలి ఠాకూర్, సర్పంచ్లు, వార్డ్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.