TEJA NEWS

నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం రవాణా టెండర్లు
ఉమ్మడి జిల్లాలో ఒకరూలు…వనపర్తికి మరో రూలు
కొరవడిన కలెక్టర్ పర్యవేక్షణ*
పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం*
-బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*


సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ధాన్యం రవాణా టెండర్లు కేటాయిస్తున్నారని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు.

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం రవాణా కొరకు టెండర్లు ఆహ్వానించిందని,అయితే కొన్ని కారణాల వల్ల జిల్లాలోని కొత్తకోట, పెబ్బేరు సెక్టారుకు సంబంధించిన టెండర్లు రద్దు చేసి మళ్లీ రీ టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు.
దీనికి సంబంధించి కొత్తకోట సెక్టారుకు 2, పెబ్బేరు సెక్టారుకు 3 దాఖలు కాగా మంగళవారం వాటిని ఓపెన్ చేశారన్నారు.

నిబంధనల ప్రకారం దాఖలు చేసిన వాహనాలకు సంబంధించిన పత్రాలను అడిషనల్ కలెక్టర్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు సమక్షంలో రోడ్డు రవాణా అధికారి పరిశీలించాలన్నారు.

కానీ ఫారం B 24 కు సంబంధించిన కొన్ని పత్రాలు నాగర్ కర్నూలు జిల్లా ఆర్టీవో ముద్ర వేసి ఇచ్చారని, కానీ సంతకం లేదన్న కారణంతో వనపర్తి ఆర్టీవో అభిప్రాయం తీసుకోకుండానే జిల్లా మేనేజర్ ఇర్ఫాన్ పెబ్బేరు ,కొత్తకోట సెక్టార్లకు సంబంధించిన ఒక్కో టెండర్ ఫారం రద్దు చేశారని మండిపడ్డారు.

నాగర్ కర్నూలు,కల్వకుర్తి, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన పత్రాలు సమర్పిస్తే అక్కడ ఆమోదించారని, వనపర్తి జిల్లాలో మాత్రం ఎందుకు రద్దుచేశారో చెప్పాలన్నారు.

కీలకమైన శాఖలపై కలెక్టర్ పర్యవేక్షణ కొరవడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా కొన్ని శాఖల అదికారులు మాత్రం బిఆర్ఎస్ నాయకుల ఒత్తిడికి తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇర్ఫాన్ అవినీతి అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జెఎసి నాయకులు రాఘవేందర్ గౌడ్, అంజన్న యాదవ్,మహిందర్ నాయుడు, శివ గౌడ్, మ్యాదరి రాజు, గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నల్లవెల్లి భరత్, గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శివ నాయక్,తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS