TGPSC ద్వారా ఈనెల 9 వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్ష

TGPSC ద్వారా ఈనెల 9 వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్ష

TEJA NEWS

Group-1 Exam to be conducted by TGPSC on 9th of this month

TGPSC ద్వారా ఈనెల 9 వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్ష ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని, పరీక్ష వ్రాసే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

   ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు పరీక్ష వ్రాసే అభ్యర్ధుల కోసం కొన్ని సూచనలు జారీ చేశారు. ఈ నెల 9వ తేదిన జరిగే గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయము 10.30 గంటల నుండి మద్యాహ్నం 01.00 గంటల వరకు పరీక్ష జరుగుతుందని,  సుమారు 5233 మంది అభ్యర్థులు పరీక్షకు  హాజరగుతున్నారని తెలిపారు. 

పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష హాలుకు హాల్ టికెట్ తో పాటుగా ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, పాన్ కార్డ్, ఓటరు ఐడి కార్డు, ఇతర ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి మరియు బ్లూ / బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ను తప్పనిసరిగా తీసుకెళ్లాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఎవ్వరికి కూడా మొబైల్ ఫోన్లు అనుమతించ బడదని, చీఫ్ సూపరిండెంట్లకు మాత్రమే అత్యవసర సేవలకు అనుమతించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్ష హాలు నుండి బయటకు వెళ్ళేందుకు అనుమతించబడదని, పరీక్ష హాలును వదలి వెళ్ళే ముందు, అభ్యర్థి OMR ఆన్సర్ షీట్ ను ఇన్విజిలేటర్‌కు అందజేయాలని,
బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ ద్వారా అభ్యర్థి తన బయోమెట్రిక్‌ ను క్యాప్చర్ చేసే వరకు పరీక్ష హాలు నుండి బయటకు అనుమతించబడరని, అభ్యర్థి ఎవరైనా తన బయోమెట్రిక్‌ ను ఇవ్వకపోతే వారి OMR ఆన్సర్ షీట్ మూల్యాంకనం చేయబడదని తెలిపారు.
చేతులకు మెహంది, టాటూలతో పరీక్షకు వెళ్లకూడదని, ఒకవేళ ఉంటే బయోమెట్రిక్ చేయుటకు తంబ్ ఇంప్రెషన్ పడకపోవచ్చునని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్దులు షూస్, సాక్స్ ధరించరాదని, కేవలము చెప్పులు మాత్రమే ధరించాలని, పరీక్ష కేంద్రములోనికి ప్రవేశించడానికి ఉదయము 09.00 గంటల నుండి 10.00 గంటల వరకు అనుమతి ఉంటుందని, ఉదయం 10.00 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైననూ పరీక్ష హాలు లోనికి అనుమతించబడరని, పరీక్ష కేంద్రము మెయిన్ గేట్ ఉ.10.00 గం.లకు మూసి వేయబడుతుందని తెలిపారు.
అభ్యర్థులు పరీక్షకు కనీసం ఒకరోజు ముందుగా తమ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా కేంద్రం యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని తెలుసుకోవాలని కోరారు. పరీక్ష కేంద్రములోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైలు ఫోన్ లు, కాలిక్యులేటర్లు, చేతి
గడియారాలు, బంగారు ఆభరణాలు, హాండ్ బ్యాగ్ లు, బ్లూటూత్ డివైస్ లు, పెన్ డ్రైవ్ లు, రైటింగ్ ప్యాడ్ లు, తెల్ల కాగితాలు అనుమతించబడవని తెలిపారు. పరీక్ష వ్రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం, సమయాన్ని అంచనా వేయడానికి ప్రతి అరగంట పూర్తయిన తర్వాత హెచ్చరిక బెల్ మోగించబడుతుందని,
పరీక్షకు హాజరయ్యే అభ్యర్దులు ఈ సూచనలు తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో కోరారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS