
సీలింగ్ పట్టా ఉన్నా పోలీసుల అనవసర జోక్యంతో అక్రమ కేసు
భూ రక్షణ కోసం ప్రజావాణిలో బాధితుడు కలెక్టర్కు ఫిర్యాదు
వనపర్తి
సీలింగ్ పట్టా భూమి ఉండి, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నా అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నారని వనపర్తి జిల్లా ఆత్మకూర్ మున్సిపాలిటీ పరిధి ఖనపురం గ్రామానికి చెందిన దళిత రైతు మషన్న ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడుతూ
సర్వే నెం. 164/15/2 లో ప్రభుత్వం మంజూరు చేసిన సీలింగ్ పట్టా భూమికి పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్నానని, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నానని మషన్న తెలిపారు. అయితే తన తమ్ముడు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, భూమిలో వాటా కావాలని వేధిస్తున్నాడని ఆరోపించారు. ఎలాగైనా భూమి లాక్కోవాలనే దురుద్దేశంతో తనకు తెలియకుండానే పొలం దున్ని, పోలీసుల సహకారంతో తనపై అక్రమ కేసు పెట్టాడని వాపోయారు. సివిల్ కేసుల్లో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని, కోర్టులో తేలాల్సిన విషయాల్లో పోలీసుల ప్రమేయం ఎక్కువగా ఉందని బాధితుడు ఆరోపించారు.
ఎటువంటి నోటీసు, సమాచారం లేకుండా తనను తన కుమార్తెను నేరుగా కోర్టుకు పిలిపించారని, దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యానని మషన్న తెలిపారు.నా భూమిని దున్ని నాపైనే అక్రమంగా కేసు పెట్టారు. సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధం. నాకు న్యాయం చేసి అక్రమ కేసు తొలగించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, మా భూమికి రక్షణ కల్పించాలి” అని ఫిర్యాదులో ఆయన కలెక్టర్ను కోరారు.