
చిట్యాల డబుల్ బెడ్రూమ్ కాలనీలో సౌకర్యాలను పరిశీలించిన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్ : డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండి వీపి గౌతమ్ ఆదేశించారు.
వనపర్తి శివారులోని చిట్యాల డబుల్ బెడ్రూమ్ గృహాల కాలనీని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
కాలనీలోని పరిస్థితులు, ప్రజలకు అందిస్తున్న సౌకర్యాల గురించి జిల్లా కలెక్టర్ ఎండీకి వివరించారు. అనంతరం ఎండీ గౌతమ్ ప్రజారోగ్య, మున్సిపల్ శాఖ అధికారులకు కాలనీలో అవసరమైన సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని సూచించారు.
కాలనీ ప్రజలు మాట్లాడుతూ, కాలనీలోని ప్రభుత్వ స్థలాలను కొందరు అక్రమంగా ఆక్రమిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
అలాగే కాలనీలో అంగన్వాడీ కేంద్రం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా, వీలైనంత త్వరగా వాటి ఏర్పాటుకు చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు.
కాలనీలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం సెప్టిక్ ట్యాంక్ సౌకర్యం కల్పించాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు ఎండీ గౌతమ్ సూచించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి కాలనీ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, హౌసింగ్ పీడీ విఠోబా, సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.