తెలంగాణ ఖజానాకు భారంగా మారనున్న కాళేశ్వరం.. కాగ్‌ నివేదికలో కాళేశ్వరం గుట్టు

తెలంగాణ ఖజానాకు భారంగా మారనున్న కాళేశ్వరం.. కాగ్‌ నివేదికలో కాళేశ్వరం గుట్టు

TEJA NEWS

Kaleswaram Loans: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికి భారంగా మారుతుందని కాగ్‌ అభిప్రాయపడింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు గుదిబండగా మారుతాయని పేర్కొంది.

కాళేశ్వరం కోసం తీసుకున్న అప్పుల్లో 12 ఏళ్లలో ప్రభుత్వం భరించాల్సింది రూ.2.66 లక్షల కోట్లకు చేరనుంది. అసలు కాకుండా వడ్డీలతో కలిపి రుణాల తిరిగి చెల్లింపులకే రూ.1.41 లక్షల కోట్లు అవసరం అవుతాయని లెక్క తేల్చారు.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పెనుభారంగా మారనుందని కంప్టోలర్ అండ్ ఆడిటర్ జన రల్ నివేదిక స్పష్టం చేసింది. “2022 మార్చి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కు మొత్తం రూ. 96,064 కోట్ల రుణాలు తీసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందని కాగ్ పేర్కొంది.

ఈ హామీల ఆధారంగా 2022 మార్చి నాటికి రూ.87,449. 15 కోట్లు వివిధ బ్యాంకుల నుంచి సమీకరించారు. 2035-36 నాటికి ఈ అప్పులపై వడ్డీతో కలిపి రూ. 1,41,544.59 కోట్లు తిరిగి చెల్లించాలి. రుణ ఒప్పందాల ప్రకారం పేర్కొన్న వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తేనే తిరిగి చెల్లించాల్సిన సొమ్ము రూ.1.41లక్షల కోట్లుగా ఉంటుంది.

ఆర్‌బిఐ వడ్డీ రేట్లు తరచూ మారుతుంటాయి. వడ్డీలు పెరిగితే చెల్లించాల్సిన రుణం కూడా పెరుగుతుందని కాగ్ అభిప్రాయపడింది. కాళేశ్వరం పూర్తిస్థాయిలో పనిచే యడం ప్రారంభమై.. అనుకున్న ప్రకారం నీటిని ఎత్తిపోస్తే కరెంటు ఛార్జీల కింద ప్రభుత్వం ఏటా రూ.10,874.56 కోట్ల చొప్పున రాబోయే 12 ఏళ్లలో సుమారు రూ.1,24,495 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రాజెక్టు వార్షిక నిర్వహణ కోసం రూ.272.70 కోట్లు, తరుగుదల ఖర్చుల కింద రూ.2,761 కోట్లు అవసరం అవుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక ప్రకారం.. పథకం పూర్తయినా పెద్దగా ఆదాయమేమీ రాదని ఖర్చు చేసిన ప్రతి రుపాయిలో 52పైసల కంటే తక్కువే ఆదాయం వస్తుందని అంచనా వేశారు.

రాష్ట్రంలో ప్రజలకు సాగు, తాగునీరు సరఫరా చేసినందుకు రాబడిని పొందే నిబంధనలేమీ ఇప్పటివరకు లేవని పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితులు లేవని అభిప్రాయ పడింది. ప్రాజెక్టు కోసం చేసిన రుణాన్ని వడ్డీ సహా తిరిగి చెల్లించడానికి, నిర్వహణ వ్యయం కలిపి మొత్తం రూ.2.66 లక్షల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 12 ఏళ్లలో భరించాల్సి ఉంటుందని లెక్కతేల్చారు.

సాధారణ బడ్జెట్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వరంగ సంస్థలు రుణాలు తీసుకుంటే 14 ఏళ్లలో వాటిని తిరిగి చెల్లించాలనే నిబంధనలున్నాయి. ఈ లెక్కలో 2022 నుంచి 2036 మధ్య ఏటా కాళే శ్వరం కార్పొరేషన్ తీసుకున్న అసలు రుణం రూ.87,369.80 కోట్లతో పాటు దానిపై 14 ఏళ్లకు వడ్డీ మరో రూ.54,174.70 కోట్లు కలిపి మొత్తం రూ.1,41,544.59 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది” అని కాగ్ లెక్క వేసింది. దీనికి నిర్వహణ ఖర్చులు, వడ్డీ పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు, మరమ్మతులు కలిపితే ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని అభిప్రాయ పడింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS