కమలనాథుల కదనోత్సాహం.. ఓటింగ్‌ సరళిపై సంతృప్తి

కమలనాథుల కదనోత్సాహం.. ఓటింగ్‌ సరళిపై సంతృప్తి

TEJA NEWS

  • సికింద్రాబాద్‌ , మల్కాజిగిరి, చేవెళ్లలో గెలుపుపై ధీమా

హైదరాబాద్‌ సిటీ: లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ సరళి తమకు అనుకూలంగా ఉందని, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి మెజార్టీతో సీట్లు కైవసం చేసుకుంటామని, హైదరాబాద్‌ నియోజకవర్గంలో ఓటింగ్‌ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈసారి ప్రధాని మోదీ హవా బాగా కనిపించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఓటు వేసిన వారు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వేశారని నాయకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లో తక్కువ స్థానాలు రావడంతో లోక్‌సభ ఎన్నికలను బీజేపీ నాయకులు సవాల్‌గా తీసుకున్నారు. గ్రేటర్‌ పరిధిలోని నాలుగు స్థానాల్లో గట్టి అభ్యర్థులను నిలబెట్టారు. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్లలో హేమాహేమీలను బరిలోకి దింపడంతో విజయం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు.

సికింద్రాబాద్‌లో కమలమేనా..!!

సిట్టింగ్‌ స్థానమైన సికింద్రాబాద్‌ను మరోసారి కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉన్నారు. 1991, 98, 99, 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కిషన్‌రెడ్డి రెండో సారి మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి గట్టి పోటీ ఉన్నా మోదీ హవా కలిసి వచ్చిందని అంటున్నారు. మరో వైపు బీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ కూడా బీజేపీకి పడినట్లు అంచనా వేస్తున్నారు.

మల్కాజిగిరిలో గెలుపుపై ఆశ

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ గెలుపు తథ్యమని పార్టీ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. మొదటి నుంచి మల్కాజిగిరి స్థానంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. పోలింగ్‌ సరళి చాలా ప్రాంతాల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు. విద్యాధికులు, కాలనీ ఓటర్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. మరో వైపు ఈటల రాజేందర్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేయడం పార్టీకి కలిసి వచ్చినట్లు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో సత్తా చూపుతుందా..!!

ప్రతి ఎన్నికలో పాతబస్తీలో కమలం సత్తా నిరూపించుకునేందుకు ప్రయత్నం చేసింది. జనసం్‌ఘగా ఉన్నప్పటి నుంచి హైదరాబాద్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నది. ఈసారి ఇక్కడి నుంచి బీజేపీ తరపున మాధవీలత పోటీలో ఉన్నారు. గతంలో కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి వస్తాయని ఆశతో ఉన్నారు. పది వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని అభ్యర్థి మాధవీ లత ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి పట్టున్న గోషామహల్‌, కార్వాన్‌లో ఓటింగ్‌ సరళి తమకు అనుకూలంగా ఉందని పార్టీ అంచనా వేస్తున్నది. చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురాలో కూడా బీజేపీకి ఓట్లు అధికంగానే పడ్డాయని అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన ఓట్ల కంటే ఈసారి ఎక్కువగా వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈసారి హైదరాబాద్‌లో పోలింగ్‌ శాతం ఎక్కువ నమోదు కావడం తమకు లాభిస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి..

Print Friendly, PDF & Email

TEJA NEWS