TEJA NEWS

స్విమ్స్ అభివృద్ధికి అదనంగా రూ. 71కోట్లు
** తిరుమల పరిధిలో పచ్చదనం పెంపునకు రూ.4 కోట్లు
** టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం

తిరుమల: టీటీడీకి చెందిన తిరుపతిలోని స్విమ్స్ మెడికల్ కాలేజీ, అనుబంధ ఆస్పత్రుల అభివృద్ధికి ఇప్పుడు ఏడాదికి ఇస్తున్న రూ.60 కోట్ల నిధులతో పాటు ఇకపై అదనంగా రూ.71 కోట్లు ఇవ్వాలని టీటీడీ పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు తిరుమ‌ల‌ అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో మంగ‌ళ‌వారం ఉద‌యం టీటీటీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌ర‌గింది. టీటీడీ చైర్మ‌న్ బొల్లినేని రాజగోపాల్ (బీ.ఆర్‌.)నాయుడు అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన స‌మావేశంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది. ఆ వివ‌రాల‌ను టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు మీడియాకు వివ‌రించారు.

స‌మావేశంలో ముఖ్య నిర్ణ‌యాలు

  • రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్నిఅట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుంచి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యం. ప్ర‌భుత్వ ఆమోదం వ‌చ్చాక ద‌శ‌ల‌వారీగా 2025-26 సంవ‌త్స‌రంలో రూ.1.74కోట్లు, 2026-27 సంవ‌త్స‌రంలో రూ.1.13కోట్లు, 2027-28 సంవ‌త్స‌రానికి రూ.1.13కోట్లు ప్ర‌భుత్వ అట‌వీశాఖ‌కు విడుద‌ల చేసేందుకు నిర్ణ‌యం.
  • తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, అమ‌రావ‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, నారాయ‌ణ‌వ‌నం క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, క‌పిల‌తీర్థం క‌పిలేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, నాగాలాపురం వేద‌నారాయ‌ణ‌స్వామి ఆల‌యం, ఒంటిమిట్ట కోదండ‌రామ స్వామి ఆల‌యాల అభివృద్ధి కోసం స‌మ‌గ్ర బృహ‌త్ ప్ర‌ణాళిక త‌యారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుంచి సాంకేతిక‌, ఆర్థిక ప్ర‌తిపాద‌న‌లు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యం.
  • తిరుమ‌ల‌లోని విశ్రాంత భ‌వ‌నాల పేర్లు మార్పులో మిగిలిన ఇద్ద‌రు దాత‌లు స్పందించ‌లేదు. దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్ల‌ను టీటీడీనే మార్పు చేయాల‌ని నిర్ణ‌యం. ఇండియ‌న్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విష‌యంలో వారితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం.
  • తిరుమ‌ల‌లోని బిగ్ క్యాంటీన్లు, జ‌న‌తా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణ‌యించే అంశంపై ఆమోదం. భ‌క్తులకు నాణ్య‌మైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యం.
  • ఆకాశ‌గంగ‌, పాప‌వినాశ‌నం ప్రాంతాల‌ను భ‌క్తులు విశేష సంఖ్య‌లో సంద‌ర్శిస్తున్న నేప‌థ్యంలో ఇక్క‌డ‌ ఆధ్యాత్మిక, ప‌ర్యావ‌ర‌ణ‌, మౌలిక స‌దుపాయాలను మ‌రింత పెంచేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని నిర్ణ‌యం.
  • రాయ‌ల‌సీమ‌కే త‌ల‌మానికంగా ఉంటూ ఎంద‌రో పేద ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తున్న స్విమ్స్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రికి ఆర్థిక స‌హాయంగా ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న రూ.60కోట్ల‌తో పాటు అద‌నంగా మ‌రో రూ.71 కోట్లు అందించేందుకు ఆమోదం.
  • స్విమ్స్ ద్వారా మ‌రింత మెరుగైన వైద్య సేవ‌లు అందించేంద‌కు ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న డాక్ట‌ర్లు, న‌ర్సులు, పారా మెడిక‌ల్ సిబ్బంది నియామ‌కం చేప‌ట్టేందుకు నిర్ణ‌యం. అదేవిధంగా 85శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్న భ‌వంతుల‌ను (ఆంకాల‌జీ… ప‌ద్మావ‌తి చిన్ని పిల్ల‌ల ఆసుప‌త్రిల‌తో క‌లిపి) త్వ‌ర‌లోనే మిగిలిన ప‌నుల‌ను కూడా త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్ణ‌యం. శ్రీ‌వారి వైద్య సేవ‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యం.
  • టీటీడీలో ప‌ని చేస్తున్న అన్య‌మ‌త‌స్తులను బ‌దిలీ చేసేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాలు, స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణకు చ‌ర్య‌లు తీసుకునేందుకు ఆమోదం.
  • తిరుమ‌ల ఆల‌య భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాల‌జీ వాడాల‌ని నిర్ణ‌యం. దీనిపై త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆధికారుల‌కు ఆదేశం.
  • ఒంటిమిట్ట‌లో భ‌క్తుల‌కు అన్న‌దానం సేవ‌ల‌ను మరింత పెంచాల‌ని నిర్ణ‌యం.
  • తుళ్లూరు మండ‌లం అనంత‌వ‌రంలోని టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్రీ‌దేవి, భూదేవి స‌మేత‌ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం. ఇందుకు రూ.10 కోట్లు కేటాయించేందుకు ఆమోదం.
  • శ్రీ‌వారి నామావళిని రీమిక్స్ చేసి భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించిన‌ డీడీ నెక్ట్స్ లెవ‌ల్ చిత్రబృందంపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యం.