TEJA NEWS

పట్టా భూముల్లోని ఇండ్లను కూల్చేస్తారా?.. హైకోర్టు విస్మయం

అధికారుల సమన్వయ లోపంపై గుస్సా

High Court | హైదరాబాద్‌, ఆగస్టు 26 : వరంగల్‌లోని దేశాయిపేట్‌ ఎంహెచ్‌నగర్‌ వాసులకు గతంలో కలెక్టర్‌ ఇచ్చిన పట్టా భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసేందుకు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ 75 మంది హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ నోటీసులపై జస్టిస్‌ టీ వినోద్‌కుమార్‌ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. పట్టా భూము ల్లో నిర్మించుకున్న ఇండ్లను ఎలా కూల్చేస్తారని ప్రశ్నిస్తూ.. సంబంధిత ప్రభుత్వ శాఖ ల మధ్య సమన్వయం లేకపోవడాన్ని ఆక్షేపించారు. ప్రభుత్వం ఒకటే అయినా అధికారులు ఒకేతీరుగా పనిచేయడం లేద ని, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

బీపీఎల్‌ పథకం కింద పేదలకు ఇచ్చిన పట్టాలను చట్టప్రకారం రద్దు చేయకుండా ఆ స్థలాలను స్వాధీనం చేసుకోరాదని, అప్పటివరకు ఆ ఇండ్లను ఖాళీ చేయించరాదని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌, డిప్యూ టీ కమిషనర్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశా రు. ఈ వ్యాజ్యంలో కలెక్టర్‌ను ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. కలెక్టర్‌తోపాటు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ముఖ్యకార్యదర్శి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌, డీసీ, ఇరిగేషన్‌ ఈఈ తదితరులకు నోటీసులు జారీచేసి.. 3 వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేశారు.

గుడిసెల కూల్చివేతలు ఆపండి: జస్టిస్‌
కాగా, చిన్నవడ్డేపల్లి చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మాణాలు ఉన్నాయం టూ జూలై 25న జీడబ్ల్యూఎంసీ ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ వరంగల్‌ దేశాయిపేటలోని 13వ డివిజన్‌కు చెందిన మరో 127మంది హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ విచారణ జరిపారు. పిటిషనర్లతోపాటు ఆ చెరువు శిఖం పరిధిలో గుడిసెలు నిర్మించిన వా రందరికీ చట్టప్రకారం నోటీసులు జారీచేసి, అందరి వాదన వినాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. 2007-2023 మధ్య రెవెన్యూ అధికారులు పేదలకు ఇచ్చిన ఈ పట్టాలపై విచారణ జరపాలని తహసీల్దార్‌కు ఉత్తర్వులు జారీచేశారు. అధికారులు చేపట్టే చర్యలు చట్టానికి లోబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వరకు పిటిషనర్లను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించరాదని, వారి గుడిసెలు కూల్చడం లాంటి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేశారు.

అందరూ పేదలే.. అన్నీ పట్టా జాగాలే
పిటిషనర్ల తరఫున న్యాయవాది రవీందర్‌ వాదిస్తూ, కేవలం 30నుంచి 60 గ జాల స్థలాల్లో పేదలు ఇండ్లను నిర్మించుకుని ఇంటి పన్నుతోపాటు విద్యుత్తు బిల్లులు చెల్లిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు అధికారులు వచ్చి ఆ ఇండ్లు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్నాయని, కూల్చేస్తామని నోటీసులు జారీ చేయడం దారుణమని పే ర్కొన్నారు. ఆ ఇండ్లు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో ఉన్నట్టు నిర్ధారణ చేయలేదని, సర్వేకూడా జరపలేదని చెప్పారు. ఇండ్ల న్నీ పట్టా భూముల్లోనే ఉన్నాయని, ఆ ఇండ్ల జోలికి వెళ్లకుండా ఉండేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

కార్పొరేషన్‌ వాదన ఇదీ..
జీడబ్ల్యూఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని గతంలో ఇదే హైకోర్టు ఆదేశించిందని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ గుర్తుచేశారు. దీంతో భద్రకాళి చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలోని 250 గుడెసెలను తొలగించామని, మరికొన్ని ఆక్రమణలను తొలగించాల్సి ఉన్నదని వివరించారు. చిన్న వడ్డేపల్లి చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో ఉన్న 329 గుడెసెలను తొలగింపునకు డివిజన్‌ బెంచ్‌ గడువు ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మున్సిపల్‌ చట్టం-2019లోని 178, 180, 181 సెక్షన్ల కింద పిటిషనర్లకు జీడబ్ల్యూఎంసీ నోటీసులు ఇచ్చిందని, అయినప్పటికీ వారి గుడిసెల కూల్చివేతకు చర్యలు చేపట్టడం చెప్పారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS