ప్రపంచంలోనే రిచ్ టెంపుల్

ప్రపంచంలోనే రిచ్ టెంపుల్

TEJA NEWS

The richest temple in the world

ప్రపంచంలోనే రిచ్ టెంపుల్

అనంత పద్మనాభ స్వామి ఆలయం

కేరళా తిరువనంతపురం

ప్రత్యేక కథనం కల్లూరు హేమాద్రి

అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం.

తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. విష్ణుభక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్ష్మమయ్యాడు. ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ, బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు. ఒక రోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరుగెత్తాడు. అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలని పిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడు. ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్యబాట పట్టగా, క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు, అనంతరం ఒక మహా వృక్షరూపంలో నేలకొరిగి శ్రీమహావిష్ణువు శేషశాయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కి.మీ. దూరం వ్యాపించి, శిరస్సు ‘తిరువళ్ళం’ అన్న గ్రామం వద్ద, పాదములు ‘త్రిప్పాపూర్’ వద్ద కన్పించాయి. అంతటి భారీ విగ్రహన్ని మానవమాతృలు దర్శించడం కష్టమని, కనువిందు చేసే రూపంలో అవతరించాలని
ముని వేడుకున్నాడు. విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కన్పించగా, ఆ విగ్రహాన్ని తెచ్చి ‘తిరువనంతపురం’ లో ప్రతిష్ఠించినట్లు కథాంశం.

ఆలయ నిర్మాణం సుమారు 5వ శతాబ్దకాలంలో ‘చేరమాన్ పెరుమాళ్’ అనే రాజు ఈ ఆలయానికి మొదటి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ రాజు హయాంలో ఆలయంలోని పూజారులు, పాలనా ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తుంది. అనంతరం సా.శ. 1050 వ సంవత్సరంలో స్థానిక పాలకులు ఆలయ ప్రాకారం నిర్మించారని తెలుస్తుంది. తరువాత సా.శ. 1335-1384 సంవత్సర మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ‘వీరమార్తాండ వర్మ’ అనే రాజు ఆలయ పాలన, వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు. ఇతని హయాంలో సా.శ. 1375 సంవత్సరంలో అల్పిసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టాడు. ప్రతి ఆరు మాసాలకొకసారి ఈ ఉత్సవం జరుగుతుంది. పదిరోజులపాటు సాగే ఈ ఉత్సవం నేటికి కొనసాగుతూ ఉంది. సా.శ..1459-60 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ గర్భగుడి పునరుద్ధరణ జరిగింది. సా.శ.1461లో ఒక రాతిపై ‘ఓట్టకల్ మండపం’ నిర్మాణం జరిగింది. అనంతరం సా.శ. 1729 సంవత్సరంలో తిరువాన్కూర్ రాజు ‘ మార్తాండవర్మ’ కాలం నుంచి నేటి వరకు ఆలయ నిర్వహణతో పాటు పలు మండపాలు, ముఖద్వారాలు, ప్రాంగణాలు, ఆలయ నిర్మాణాలు జరిగాయి.
ప్రధానాలయం మలయాళ సంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలిగోపురం ఆనుకొని చుట్టూ ప్రహారి నాలుగు ముఖద్వారాలతో నిర్మించబడింది. ఆలయంలో స్వామి ఊరేగింపుకై ప్రాంగణం నిర్మించబడింది. నాలుగు మూలల నాలుగు ఉయ్యాల మండపాలతో, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో ‘పుష్కరిణి’ చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది. ఆలయంలో శ్రీ నారసింహ, శాస్త (అయ్యప్ప), పార్థసారథి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది.

ఆలయం ప్రస్తుతం ట్రావెంకొర్ రాజకుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది.
ట్రావంకోర్ రాజకుటుంబం చేరవాంశానికి చెందిన వారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యాదేశములు అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమత్భాగవతంలో బలరామదేవుడు తన తీర్ధయాత్రలో భాగంగా ఫాల్గుణం (ప్రస్తుత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ) అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో (పద్మతీర్థంలో) స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది (6వ శతాబ్దం-9వ శతాబ్దం)
.సా.శ. 16వ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అపుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళా రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. ‘తిరు అనంత పురం ‘ అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందుధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. (సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి, సంపూర్ణ ఆనందం).

ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో (అనంతశేషుడి తల్పం మీద యోగనిద్ర)ఉంటాడు. ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది.
ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి తిరుమల వడ్డి కాసుల వాడు… ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంత పురంలోని అనంత పద్మ నాభ స్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు, వైడుర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆబరణాలు మొదలగు వాటితొ లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇంకా బయట పడవలసిన సంపద వున్నందున పూర్తి స్థాయిలో సంపద నంతటిని లెక్కకట్టాల్సి ఉంది. ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి వున్నది తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860 లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950 లో సీల్ వేశారు. స్వాతంత్ర్యానంతరం స్థానిక ఆలయాలన్నిటిని ట్రావెంకూర్ దేవస్తానం బోర్డులో విలీనం చేసినా ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్వవేక్షణ క్రిందనే వుంచు కున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు. ప్రస్తుతం ఎనభై తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఉత్తరదామ్ తిరుణాల్ మార్తాండ ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా వున్నదని దాన్ని గాడిలో పెట్టాలని టి.పి. సుందర రాజన్ అనే న్యాయ వాది సుప్రీం కోర్టులో దావా వేయగా, సుప్రిం కోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా ఆ నేల మాళిగలలోని అనంత సంపద వెలుగు చూసింది. ఇప్పటివరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనె అనంతమై సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి వుంచ బడి వున్నదని తెలుస్తున్నది. ఇప్పటివరకే బయట పడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది.
ఇప్పటి వరకు బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాబరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాలకొద్ది బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు గొలుసులు బయల్పడ్డాయి. పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణెలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లబ్య మయాయి. అంతే గాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నొ ఉన్నాయి.
ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి.
ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైనది అయిన ఆరో గది తెరవాల్సి ఉంది కొన్ని కారణాల వల్ల తెరవలేదు

Print Friendly, PDF & Email

TEJA NEWS