TEJA NEWS

ఖాకీ వదిలి ఖద్దర్ వేసుకో.. రంగనాథ్ పై ఏలేటి ఫైర్.

హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‎పై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఐపీఎస్ అధికారులు వారి వృత్తిలో భాగంగా అవసరమైతనే మీడియాతో మాట్లాడాలి. కానీ రంగనాథ్ తన ఇమేజ్ ప్రమోషన్ కోసం అదే పనిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హైడ్రా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇంటర్వ్యూలు ఇస్తే ఫర్వాలేదు. కానీ ఇంటర్వ్యూల్లో నన్ను ఉద్దేశించి మాట్లాడడమే కరెక్ట్ కాదు. రంగనాథ్.. పొలిటికల్ లీడర్ కావాలనుకుంటున్నారా? అయితే, ఖాకీ వదిలి ఖద్దర్ దుస్తువులు వేసుకోవాలి’ అని ఏలేటి సూచించారు.

ముఖ్యమంత్రి ఇచ్చే ప్రమోషన్, లేకుంటే రాజకీయ పదవి కోసమే హైడ్రా చీఫ్​ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ‘హైడ్రా కమిషనర్‎కు హై సెక్యూరిటీ అంటూ హంగామా చేస్తున్నారు. టెర్రరిస్టులు, నక్సల్స్‎తో పోరాడిన ఎంతో మంది అధికారులు ఉన్నారు. అంత కంటే ఏం ఎక్కువ చేశారని రంగనాథ్‎కు సెక్యూరిటీతో హైప్ క్రియేట్ చేస్తున్నారు. చెరువుల ఆక్రమణలను హైడ్రా కూల్చడాన్ని బీజేపీ స్వాగతిస్తున్నది.

కానీ పాతబస్తీ, సలకం చెరువులో ఆక్రమణలు కూల్చాకే.. మిగతావి కూల్చాలి.కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నారా? హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు నడుస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. సలకం చెరువులో ఒవైసీ నిర్మాణాలకు ఉన్న కండీషన్లు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డికి వర్తించవా? ఒవైసీకీ ఆరు నెలలు సమయం ఇస్తున్నప్పుడు, మిగతా వారికి, ఎన్ కన్వెన్షన్‌కు ఎందుకు ఇవ్వలేదు? ఓల్డ్ సిటీలోకి వెళ్లే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి లేదా’అని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు.


TEJA NEWS