
ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించే పక్షంలో తీవ్ర చర్యలు తప్పవని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యకలాపాల సమీక్షా సమావేశం మంగళవారం సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో జరిగింది. వర్షా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బక్రీద్ పర్వ దిన ఏర్పాట్లు, స్కూల్ లు తెరుస్తున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, టాక్స్, హౌసింగ్ సమస్యలు, ఇతరత్రా అంశాల పై ఈ సమావేశం లో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పద్మారావు గౌడ్ మాట్లాడుతూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఎదురుకావడం శోచనీయమని తెలిపారు. నిధుల కేటాయింపుతో నిమిత్తం లేని అన్ని సమస్యలను వెన్వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నాలా పుడిక తీసివేతను వెంటనే పూర్తి చేయాలనీ ఆదేశించారు. అన్ని మునిసిపల్ డివిజన్ల లో అత్యవసర బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అపాయకరంగా నిలిచిన విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని, వివిధ ప్రదేశాల్లో చెట్ల కొమ్మల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా వాటిని తొలగించాలని సూచించారు.
అడ్డగుట్ట, లాలాపేట, ఎరుకల బస్తీ ఫంక్షన్ హాల్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలనీ, స్విమింగ్ పూల్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. లాలాపేట లో రోడ్డు విస్తరణను పూర్తి చేసినప్పటికీ స్తంభాల తొలగింపు, ఇతరత్రా పనులు చేపట్టని కారణంగా విస్తరించిన ప్రయోజనం నెరవేరడం లేదని తెలిపారు. చంద్ర బాబు నగర్, పాండవ బస్తీ, శాస్త్రి నగర్, లంబాడి బస్తీ, మంగర్ బస్తీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఇళ్ళు శిధిలావస్థకు చేరిన పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్షంగా వ్యవహరించడం తగదని తెలిపారు. సుబాష్ చంద్ర బోస్ నగర్, దోభీ ఘాట్ లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపు వెంటనే పూర్తి చేయాలనీ, సాయి నగర్ లో నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలనీ సూచించారు. రాజీవ్ యువ వికాసం అర్హులైన దరఖాస్తులు పరిష్కరించాలని సూచించారు. మేడి బావి నివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొత్త వార్డు కార్యాలయం నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలనీ, ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణం, లాలాగూడ లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు విద్యుత్ సరఫరా కు ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని సూచించారు. ఓపెన్ జిమ్ ల ఏర్పాటు అంశంలో త్వరితగతిన ఏర్పాట్లు జరపాలని, శాస్త్రి నగర్ లో రుద్ర వీణ సంస్థ అభ్యర్ధనకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్, సేవలాల్ మహారాజ్ భవనం నిర్మాణానికి ఏర్పాట్లు జరపాలని కోరారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల అధికారులు ప్రజలకు అందుబాటులో నిలవాలని పద్మారావు గౌడ్ సూచించారు.
వివిధ విభాగాల మధ్య తమ కార్యాలయం ద్వారా నిర్వహించే సమన్వయ వాట్స్ అప్ గ్రూప్ ల సందేశాలకు వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమీషనర్ డీ.సుభాష్ రావు మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయని, అన్ని విభాగాల మధ్య సమన్వయo ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. జీ.హెచ్.ఎం.సీ. సూపర్ఇంటేన్ డింగ్ ఇంజినీర్ ఆశా లతా మాట్లాడుతూ వర్షా కాలంలో ఎటు వంటి సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నామని తెలిపారు. నిధుల కేటాయింపు కు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్పొరేటర్లు సామల హేమ (సితాఫలమండీ), కంది శైలజ (బౌద్దనగర్), రాసురి సునీత రమేష్(మెట్టుగూడ), లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్(అడ్డగుట్ట)లు తమ డివిజనల పరిధులలో వివిధ సమస్యలను అధికారులకు వివరించారు. విద్యుత్ స్థంభాల తొలగింపు, అపాయకరంగా ఉన్న వైర్ల పునరుద్దరణ వంటి అంశాల పై విద్యుత్ అధికారులు స్పందించాలని వారు సూచించారు. జీ.హెచ్.ఎం.సీ.కి. చెందిన ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, UCD, స్పోర్ట్స్, ఎలక్ట్రికల్ వింగ్, హెల్త్ & శానిటేషన్, ఎంటమాలజి, హౌసింగ్, హార్టికల్చర్, ప్రాజెక్టుల విభాగాల అధికారులు సుభ్రమణ్యం, వెంకటేష్, రవీందర్, శ్రీనాద్, జీ.ఆర్.కే. రెడ్డి, సువర్ణ, గణేష్, కిష్టయ్య, సంధ్య, లావణ్య, సునీత, హేమలత, డాక్టర్ మారుతీ, కే.రోహిణి, సుదర్శన్, తాసిల్దార్ భీమయ్య గౌడ్, విద్యాధికారి ప్రతాప్ రెడ్డి, విద్యుత్ అధికారి మహేష్, వైద్యాధికారులు డాక్టర్ కే.శ్రీకాంత్, డాక్టర్ వందన, డాక్టర్ జయశ్రీ, రేషనింగ్ అధికారులు పాల్గొన్నారు.
