TEJA NEWS

డాన్‌గా ఎదగాలనే తుపాకీ కొన్నా….!!!

గాజులరామారం కాల్పుల నిందితుడు నరేశ్‌ ఒప్పుకోలు

ఆయనతోసహా 15 మంది అరెస్ట్‌, రిమాండ్‌

హైదరాబాద్: గాజులరామారం లోని ఓ బార్‌ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు మల్లంపేట నరేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో సహా 15 మందిని కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి నాటు తుపాకీ, 87 బుల్లెట్లు, తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఈనెల 27న అర్ధరాత్రి చేబ్రోలు పూర్ణిమ (35), అజయ్‌చంద్ర, గౌతమ్‌ బైక్‌పై మల్లంపేట నుంచి గాజులరామారం వస్తుండగా ఎల్‌ఎన్‌ బార్‌ వద్ద వీరి వాహనంలో పెట్రోల్‌ అయిపోయింది. బార్‌ వద్ద వాహనాల్లో పెట్రోలు తీస్తుండగా సిబ్బంది వారించారు. దీంతో ఘర్షణ పెరగగా, పూర్ణిమ నరేష్‌, శివలకు ఫోన్‌ చేసి త్వరగా రావాలని కోరింది.

దీంతో నరేశ్‌ తన గ్యాంగ్‌తో కలిసి బార్‌ వద్దకు వచ్చి నానా హంగామా చేశారు. ఆవేశంలో నరేశ్‌ తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం పారిపోగా పోలీసులు గాలించి ప్రధాన నిందితుడు నరేశ్‌తోపాటు శివ, సోహెల్‌, శ్యాంసన్‌, నరేందర్‌, ఉజ్వల్‌ సహా 15 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


TEJA NEWS