TEJA NEWS

గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నత విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ …
……………………………………………………………………………..
సాక్షిత : మధ్యతరగతి కుటుంబంలో పుట్టి గురుకుల పాఠశాలలో సీట్లను పొంది ఉన్నత విద్యలో ప్రతిభ కనబరిచిన కుత్బుల్లాపూర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలువగా గురుకుల పాఠశాలలో చదివి ఉన్నత విద్యలో రాణించిన వారిని కేటిఆర్ అభినందించారు.

వివరాల్లోకి వెళితే… కుత్బుల్లాపూర్ 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ వెంకట్రామిరెడ్డి నగర్ లో నివాసముండే మధ్యతరగతి కి చెందిన రాగి రామకృష్ణ ముదిరాజ్, లావణ్య దంపతులు జిరాక్స్ వ్యాపారం నిర్వహించుకుంటూ ముగ్గురు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి స్వాతి, తరుణ్ తేజ్, శ్వేత అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉన్నత విద్యతో కన్న తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలనే దృఢ నిశ్చయంతో….

రాగి స్వాతి అంకిరెడ్డిపల్లి గర్ల్స్ గురుకుల క్యాంపస్ లో ఆరవ తరగతి సీటు పొంది అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదివి ఏ గ్రేడ్ తో జేఎన్టీయూ, సంగారెడ్డిలో బీ.టెక్ (సిఎస్ఎం) సీటు సాధించింది .

అదేవిధంగా తరుణ్ తేజ్ తుర్కపల్లి క్యాంపస్ లో ఏడవ తరగతి సీటు సాధించి అక్కడే పదవ తరగతి పూర్తిచేసుకుని, మహేశ్వరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ నందు ఎంబీబీఎస్ సీటు సాధించాడు.

చిన్న కూతురు అయిన రాగి శ్వేత కుత్బుల్లాపూర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి లో సీటు సాధించి అక్కడే పదవ తరగతి పూర్తి చేసుకోగా, ప్రస్తుతం ఘట్కేసర్ లోని గురుకుల గర్ల్స్ క్యాంపస్ నందు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తుంది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తును రూపొందించు కోవాలనుకునే నిరుపేద విద్యార్థుల కలలను నెరవేర్చాలని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గురుకుల పాఠశాల సంఖ్యను పెంచి పౌష్టికాహారంతో కూడిన విద్య అందించారని, అలాంటి పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన మీరు భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలన్నారు.


TEJA NEWS