TEJA NEWS

ఉద్యమానికి ఊపిరి పోసింది జగిత్యాల జర్నలిస్టులే
విలేఖరులను చిన్న చూపు చూడడం తగదు
వెంటనే ఇండ్ల స్థలాలు ఇచ్చి – నిర్మాణం చేపట్టాలి
ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి డిమాండ్


జగిత్యాల :
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో గత ఆరు రోజులుగా కొనసాగుతున్న జర్నలిస్టుల నిరసన దీక్షకు ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి హాజరై దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో చల్ల బడిన ఉద్యమానికి ఊపిరి పోసింది జగిత్యాల జర్నలిస్టులేనని పేర్కొన్నారు. ఆనాడు జగిత్యాల జర్నలిస్టులు – తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ జోన్ సమస్య పై అవగాహన సదస్సుతోనే ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని సూచించారు. దాని ఫలితంగా పోలిటికల్ జెఎసి ఏర్పాటు, సకల జనుల సమ్మె ఇతరత్రా ఉద్యమాలు జగిత్యాలలో పుట్టి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. వాటన్నిటితోనే రాష్ట్ర సాధన సాధ్యం అయిందని వివరించారు. స్వరాష్ట్రంలో పెరిగిన జీతాలు తీసుకుంటున్న ఈ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు ఉద్యమ కాలంలో పనిచేసిన జర్నలిస్టులను కూడా గుర్తించక పోవడం బాధాకరం అన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్సీలు టి.జీవన్ రెడ్డి, ఎల్.రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్, పాలక వర్గం నిర్ణయించుకొని జగిత్యాల జర్నలిస్టులకు అందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం ద్వారా చేపట్టి పూర్తి చేయాలని చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్ట్ సంఘాలన్నీ ఏకమై ఉద్యమాలను మరింత ఉదృతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఇండ్ల స్థలాలు – ఇండ్లు ఇచ్చేది ఈ నాయకుల బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.

బుగ్గారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దూడ జీవన్ మాట్లాడుతూ జర్నలిస్టుల దీక్షకు మేము మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఇకముందు చేసే ఉద్యమాలలో కూడా బాధ్యతగా పాల్గొంటామని హామీ ఇచ్చారు. బుగ్గారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిర్ర సత్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి తిరుపతి, నక్క శంకర్,, కళ్లెం నగేష్ తదితరులు చుక్క గంగారెడ్డి వెంట పాల్గొన్నారు.


TEJA NEWS