TEJA NEWS

కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్ధిని ఆత్మహత్య యత్నం

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్యహత్యాయత్నం చేసింది. ఆ బాలికను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా, ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచారు. ఇదే విషయమై విద్యార్ధిని తల్లి మీడియాతో వివరాలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన గీతిక మద్దిరాలలోని కేజీబీవీలో ఆరో తరగతి చదువుతోంది. అక్కడి సిబ్బంది పలుమార్లు బాలికతో దురుసుగా మాట్లాడటంతో ఇదేవిషయాన్ని ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. కొద్ది రోజులుగా మనస్తాపంగా ఉంటున్న బాలిక ఉదయం పాఠశాల భవనం రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో గీతిక నడుం భాగానికి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ బాలికను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు వైద్యం అందుతున్న తీరును జిల్లా కలెక్టర్ తేజన్ నందలాబ్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి విచారణ చేయించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వీరయ్య తెలిపారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS