TEJA NEWS

రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు

పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం కోసం కట్టుబడి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి :జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి :రుయా ఆసుపత్రిలో మెరుగైన పలు సౌకర్యాల ఏర్పాటుకు కమిటీ ఆమోదిస్తూ పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు బాధ్యతగా అందించాలని వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు సంయుక్తంగా తెలిపారు.

శుక్రవారం స్థానిక ఎస్వీ వైద్య కళాశాల పాలన భవనం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించి, స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కో చైర్మన్ హోదాలో, బి.లక్ష్మీపతి సభ్యులుగా సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షలో పాల్గొని రుయా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ వైద్యులు వారి సిబ్బంది, ఇంజనీర్లు మరియు ఇతర అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అప్పుడే ఆసుపత్రి పేద రోగులకు అండదండగా వుంటుందని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ మీటింగ్ గత ఒకటిన్నర సంవత్సరం నిర్వహించలేదని అధికారులు తెలుపగా తాను కలెక్టర్ గా ఉన్న నాటి నుండి ఇది రెండో సమావేశం అని, ఇక నుండి క్రమం తప్పకుండా సమావేశం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

SVRR ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశంలో శ్రీ మతి ఎన్. మౌర్య, తిరుపతి మునిసిపల్ కమీషనర్, శ్రీ బి. లక్షీపతి హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సభ్యులు డా.పి.ఎ. చంద్రశేఖరన్, ఎస్.వి. మెడికల్ కళాశాల పిన్సిపాల్, శ్రీ ఎం. శివరామి రెడ్డి, ఎ.పి.ఎం.ఎస్‌.ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డా॥ యు శ్రీహరి, తిరుపతి జిల్లా ఆరోగ్య & వైద్యాధికారి, డా॥ ఎస్. ఆనంద మూర్తి, జిల్లా డి.సి.హెచ్.ఎస్. మరియు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥ జి రవి ప్రభు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవి ప్రభు మెంబర్ కన్వీనర్ హోదాలో ముందుగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. అనంతరం అజెండా అంశాలపై కమిటీకి నివేదించారు.కమిటీలో మునుపటి HDS సమావేశం (17-06-2024) నాడు తీసుకొన్న తీర్మానాల స్థితిని తిరిగి సమీక్ష నిర్వహించగా ఆక్సిజన్ పైప్‌లైన్‌ల నిర్వహణకు టెండర్లను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ APMSIDC పిలవడం జరిగిందని పలు అంశాలపై తీసుకున్న చర్యలను తెలిపారు. మహాప్రస్థానం వాహనాలకు సంబంధించి 3 వాహనాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ నిధుల నుండి అందించుటకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా నేటి శుక్రవారం సమీక్షలో పదకొండు (11) సి.సి. కేమేరాలను ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి, క్షయ మరియు ఛాతీ వ్యాధుల వార్డు, చిన్న పిల్లల హాస్పటల్ బ్లాక్ దారిలో అమర్చుటకు ఆమోదం తెలిపారు. నాలుగు (4) R.O. ప్లాంట్స్ ఆపరేషన్ థియేటర్లలో మరియు ల్యాబ్ ల దగ్గర ఏర్పాటు చేయుటకు (ఒక్కొక్కటి రూ. 95,000/-) NTR వైద్య సేవ నిధుల నుండి కొనుగోలు చేయుటకు ఆమోదించారు. ఆసుపత్రిలో ఉన్న దుకాణాలకు టెండర్ కాల పరిమితి 17 అక్టోబర్ 2024 న ముగిసింది. ఇప్పుడు ఉన్న దుకాణాలు ఖాళీచేయుటకు మరియు కొత్త టెండర్స్ నిర్వహించుటకు, అలాగే వాటికి నెల సరి అద్దె తగిన విధముగా పెంచవలసిందిగా సూచించారు.

హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ అకౌంట్స్ ఆడిట్ చేయుటకు చార్టెడ్ అకౌంటెంట్ ను సేవలు వినియోగించుకొని దానికి ఖర్చు HDS నిధుల నుంచి మంజూరు చేయుటకు ఆమోదించారు. చిన్న పిల్లల ఆసుపత్రిలో SNCU, NICU, PICU మరియు NRC విభాగాలకు పది (10) ఎయిర్ కండీషనర్లు కొనుగోలు చేయుటకు ఆమోదము తెలుపుతూ, హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ నిధులు తక్కువగా ఉండడము వలన వీటిని కాలేజీ డెవలప్మెంట్ నిధుల నుంచి కొనుగోలు చేయవలసిందిగా కమిటీ నిర్ణయించింది. అత్యవసర చికిత్స విభాగము వద్ద వెలుగుతున్న సూచికలను (గ్లో సైన్ బోర్డు) పెట్టుటకు కమిటీ ఆమోదము తెలిపింది. AP గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వారికి విధులలో ఉన్న వైద్యులు భోజన సదుపాయానికి ఇవ్వబడిన గది మరియు వారు నిర్వహిస్తున్న కాంటీన్ కు రెండు (2) సంవత్సరముల వరకు ఇచ్చుటకు ఆమోదము తెలుపుతూ, అలాగే AP హంసా అసోసియేషన్ వారికి మరియు నర్సింగ్ అసోసియేషన్ వారికి కలిపి ఒక కాంటీన్ నిర్వహించుకొనుటకు ఆమోదము తెలిపారు.

మానసిక చికిత్స విభాగమునకు మరమత్తులకు రూ. 30,000/- మరియు ఆపరేషన్ థియేటర్ల కు మరియు వార్డ్స్ కు మధ్య ఉన్న రెండు (2) కారిడార్ల మరమ్మతులకు రూ.8 లక్షలు ఎన్టీఆర్ వైద్య సేవా నిధుల నుండి వాడుటకు కమిటీ ఆమోదించింది. APMSIDC వారు హాస్పిటల్ పరిధిలో గుర్తించిన ఖాళీ స్థలములో గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ వారు గిరిజన ఉత్పత్తులు అమ్ముకొనుటకు ఆమోదం తెలిపారు. జిరియాట్రిక్ వార్డ్ మరమత్తులకు రూ. 23.75 లక్షలు; అదనముగా రెండు బయో మెడికల్ ఇంజనీర్ల పోస్టుల మంజూరు, ముగ్గురు ఆక్సిజన్ టెక్నీషియన్ ల పోస్టుల మంజూరు మరియు హాస్పిటల్ పరికరముల రిపేర్ గురించి వర్క్ షాప్ నిర్మించుట కొరకు వైద్యవిద్య సంచాలకులకు ప్రతిపాదనలు పంపుటకు మరియు హాస్పిటల్ లో సెంట్రల్ లాబరేటరీ అభివృద్ధి చేయుటకు కమిటీ చర్యలు తీసుకోవాలని సూచించింది.
అత్యవసర విభాగము నందు కొత్త టాయిలెట్స్ నిర్మాణానికి ( సుమారు 5 లక్షలు) కాలేజీ డెవలప్మెంట్ సొసైటీ నుంచి నిర్మించుటకు కమిటీ ఆమోదము తెలిపింది. సెంట్రల్ ల్యాబ్ అన్నివిధాల అభివృద్ధికి, ఏసీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

హాస్పిటల్లో డ్రైనేజ్ సమస్యను పరిష్కరించుటకు, ఆసుపత్రికి అదనముగా నీటి సరఫరా కొరకు మునిసిపల్ కమీషనర్ గారు సహకారం అందించాలని కోరగా సత్వర చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. హాస్పటల్ నందు ఉన్న పై కప్పు లీకేజీ సమస్య (ముఖ్యముగా చిన్న పిల్లల విభాగములో) ని మరమ్మతులకు APMSIDC వారిని ఆదేశించారు. హాస్పిటల్ లో అవసరమైన రోడ్ల నిర్మాణానికి కావలసిన నిధులు (రూ. 2.4 కోట్లు), అలాగే కొత్త మెడికల్ వార్డ్ ల నిర్మాణానికి కావలసిన నిధులు (రూ. 5.5 కోట్లు) ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి చర్చించడము జరిగినది. తుడా నిధులతో కొన్ని చోట్ల అత్యవసరమైన రోడ్ల నిర్మాణానికి సహకరించవలసిందిగా తెలిపారు. రోగులను హాస్పిటల్లో వివిధ వార్దుల కు తరలించేందుకు వీలుగా ఒక అంబులెన్స్ అద్దె వాహనము తీసుకొనుటకు ఆమోదము తెలిపారు. హాస్పిటల్లో వినియోగానికి అత్యవసరమైన పరికరాలను సిఎస్ఆర్ నిధుల కింద తేవడానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. హాస్పిటల్ లో అందుబాటులోని పరికరాలను త్వరితగతిన మరమ్మత్తులు చేయవలసిందిగా Cyrix సంస్థకు ఆదేశించారు.

ఈ సమావేశంలో అన్ని విభాగాల HODలు, A1 శానిటేషన్ ఏజెన్సీ, ఎక్స్‌పర్ట్ సెక్యూరిటీ సర్వీసెస్, నెఫ్రో ప్లస్, ప్రమోదిని ఏజెన్సీలు, నర్సింగ్ సూపరిటెండెంట్, సిరిక్స్ ఏజెన్సీ, బయోమెడికల్ ఇంజనీర్ మరియు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మొదలగు వారు సమావేశమునకు హాజరయ్యారు.

డి ఐ పీ ఆర్ ఓ , తిరుపతి


TEJA NEWS