TEJA NEWS

సమకాలీన సమాజ ఔన్నత్యానికి ప్రతిరూపం

ఖండాంతరాలకు వ్యాప్తి చెందిన మేధా సంపత్తి
చరిత్ర సృష్టించిన విశిష్టమైన కళాశాల

యస్ఆర్ &బిజీయన్ఆర్ కళాశాల!

యస్ఆర్ బిజీయన్ఆర్ కళాశాల సామాజిక ఔన్నత్యాన్ని నిలబెట్టి మూడు జిల్లాల ప్రజలకు జ్ఞానగవాక్షంగా నిలిచింది. తొలిసారి వినూత్నంగా కళాశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం (1956-2023) జరుగుతున్న నేపథ్యంలో విద్యారంగంలో ఈకళాశాల స్రృష్టించిన చరిత్ర విశిష్ట మైనది. ఖమ్మం ఖిల్లాకి ముకుటంగా నిలిచిన కళాశాల పంచిన విజ్ఞాన వీచికలు, అపార జ్ఞానంతో వేలాది కుటుంబాలకు ఉపాధి మార్గం అయ్యింది. ఎన్నోరంగాల్లో ఈకళాశాల పూర్వ విద్యార్థుల కృషి అపూర్వంగా నిలిచింది. విజ్ఞానంతోపాటు సామాజిక అనుభవం అందించడంలో కళాశాల ఔన్నత్యం కొలమానంగా నిలిచింది.1956లో ఖమ్మం జిల్లా ఏర్పాటుతో పురుషుడు పోసుకున్న ఈకళాశాల 7దశాబ్దాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు, నల్గొండ జిల్లాలోని కోదాడ, సూర్యాపేట, వరంగల్ జిల్లాలోని మహభూబా బాద్, మరిపెడ ప్రాంతానికి విద్యను పంచిన విజ్ఞానమాతగా గౌరవం పొందింది. ఈకళాశాల రాజకీయ చైతన్యానికి పట్టుగొమ్మలుగా నిలిచింది. కళాశాల పూర్వ విద్యార్థులు స్థానిక ప్రజాప్రతినిధులుగా కోకొల్లలుగా సేవలు అందించారు. ఈకళాశాల పూర్వ విద్యార్థులు నల్లమోతు భాస్కరరావు (మిర్యాలగూడ), కొండబాల కోటేశ్వరరావు (మధిర), నల్లగట్ల స్వామి దాస్ (తిరువూరు), బాణోత్ మదన్ లాల్ (వైరా) మాజీ శాసనసభ్యులుగా సేవలందించారు. ఈకళాశాల విద్యార్థి పల్లా రాజేశ్వర రెడ్డి ప్రస్థుతం జనగాం శాసనసభ్యులుగా ఉన్నారు. అంతేకాకుండా పూర్వ విద్యార్థులు పోట్ల నాగేశ్వరరావు, తాత మధు లాంటివారు యంయల్సీలుగా పనిచేశారు.

ప్రస్థుతం రాజ్యసభ సభ్యులు, మెట్రో డ్రగ్స్ అదినేత బండి పార్థ సారధిరెడ్డి ఈకళాశాల విద్యార్థినే! ఉభయ తెలుగు రాష్ట్రాలలో విప్లవోద్యమం మూలపురుషులైన బత్తుల వెంకటేశ్వరరావు, రాయల సుబాష్ చంద్రబోస్, బోగా శ్రీరాములు, గాదె మాధవరెడ్డి(దివాకర్), పోటు పుల్లయ్య, పోటు రంగారావు, వడ్డెల్లి కృష్ణమూర్తి, నంబూరి సీతారామారావు, సాదినేని వెంకటేశ్వరరావు, యం.శ్రీనివాస్, బండిరమేష్, చంద్రారెడ్డి లాంటివారు ఎందరో ఉన్నారు. సిపియం నాయకులు పోతినేని సుదర్శన్, సిపిఐ నాయకులు బాగం హేమంత్ రావు లాంటి ఎందరో వామపక్ష రాజకీయ నేతల పుట్టినిల్లుగా ఖ్యాతిగాంచింది ఎస్ ఆర్ అండ్ బిజిఎన్ ఆర్ ఈకళాశాల. ఈకళాశాల నుండి న్యాయమూర్తులు, పాలనా విభాగాల అధిపతులు, బోధనా రంగంలో అపూర్వ మేధస్సు కనిపించిన ఉద్దండులు ఎందరో ఉన్నారు. ఎందరో పారిశ్రామిక వేత్తలుగా, బయోటెక్ కంపెనీ అదినేతలుగా ఈకళాశాల విద్యార్థులు ఎదిగి వేలాదిమంది ఉపాధి బాట పట్టారు. అంతేకాకుండా ఇంకెందరో పూర్వ విద్యార్థులు ప్రతిభావంతులైన డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాద్యాయులుగా సేవలందిస్తున్నారు. ఇప్పుడున్న, ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులలో 70శాతం మంది ఈకళాశాల ఉత్పత్తినే! అంతేకాదు, కళారంగం, క్రీడారంగంలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఘనత ఈకళాశాల పూర్వ విద్యార్థులకుంది. ఊరుమ్మడి బ్రతుకు, చలి చీమల ఫేం నటుడు సత్యేంద్రకుమార్, ప్రముఖ హాస్య నటుడు బాబూమోహన్ ఈకళాశాల పూర్వ విద్యార్థులే. వందలాది ఉత్తమ జర్నలిస్టులు, కవులు,కళాకారులకు పుట్టినిల్లు ఈకళాశాల.మనదేశంలోనే కాక ఈకళాశాల పూర్వ విద్యార్థుల ప్రతిభ, ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. 70ఏళ్ళుగా విద్యారంగంలో విశిష్టత సంతరించుకున్న యస్ఆర్ & బిజీయన్ఆర్ కళాశాల ఇప్పటికీ తెలంగాణా రాష్ట్రంలో న్యాక్ ప్లస్, ప్లస్ గుర్తింపుతో అగ్రస్థానం నిలబెట్టుకుంది. ఇంత విశిష్ట మైన ఈకళాశాల తన జ్ఞాపకాలు నెమరు వేసుకునేందుకు ఈనెల 8న కళాశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరుపుకుంటుంది. ఇంతటి మహోన్నత ఈ కార్యక్రమం జయప్రదం కావాలని ఆశిద్దాం!!

Print Friendly, PDF & Email

TEJA NEWS