TEJA NEWS

సీఎం రేవంత్‌ జైలుకు వెళ్లే ప్రమాదం..

నారాయణ హాట్ కామెంట్స్

హైదరాబాద్, : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బడా బాబుల ఒత్తిడితో సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళే ప్రమాదముందంటూ వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలన్నారు. హైడ్రాతో బడా బాబులు అయినా జైలుకు వెళ్ళాల్సి వస్తుందని… లేదా వాళ్ల ఒత్తిడితో రేవంత్ రెడ్డి అయినా జైలుకు వెళ్లే ప్రమాదముందని అన్నారు.

రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నారని.. మధ్యలో ఆపేస్తే పులి తినేస్తుందని అన్నారు. అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళలో ఒక్క విజయ్ మాల్యా తప్ప మిగితా అందరూ గుజరాత్ వాళ్లే అని అన్నారు. ప్రధాని మోదీ దయాదాక్షిణ్యాల వల్ల అదానీ పెరిగారన్నారు. ఆయన సొంతంగా ఎదగలేదన్నారు. సెబీ కూడా అదానీకి దాసోహం అయ్యిందన్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యను విచారణ చేయవచ్చని ఆ రాష్ట్ర గవర్నర్ చెప్పారన్నారు. గవర్నర్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఆర్ఎస్ఎస్ మోడీని మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎన్ కన్వెన్షన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బుసకొట్టి ఊరుకున్నారన్నారు. హైడ్రా పనితీరు అభినందనీయమని కొనియాడారు. ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి.. చెరువు నిర్మాణం చేయాలన్నారు. నాగార్జున బఫర్ జోన్‌లో.. కాదు ఎఫ్‌టీఎల్‌లోనే నిర్మాణం చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆఫీస్‌లు కూడా కూల్చాలని ఎంఐఎం అంటోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయన్నారు. ప్రైవేటు నిర్మాణలును ప్రభుత్వ సంస్థలతో పోల్చడం తప్పు అని నారాయణ పేర్కొన్నారు.

పెరుగుతున్న మద్దతు..

కాగా…హైడ్రాకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అటు పొలిటికల్‌గా.. ఇటు సామాన్యుల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తోంది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రాకు కావల్సినంత మద్దతును కూడగట్టింది. అన్ని వర్గాల ప్రజలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాపై సొంత పార్టీలో ఇబ్బందులు వస్తాయని తొలుత సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కానీ ఎమ్మెల్యేలంతా రేవంత్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తారించాలని రేవంత్‌కి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. హైడ్రాపై అభినందనలు తెలుపుతూ రేవంత్‌కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్‌లు లేఖ రాశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ కోసం సీఏం రేవంత్‌కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లేఖ రాశారు. వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఎఫ్‌టీఎల్ పరిధిలో గెస్ట్ హౌజ్ కట్టాడని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు. హైడ్రాను తమ నియోజకవర్గంలో కూడా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రిక్వెస్ట్ చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో కూడా ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని వేముల వీరేశం లేఖ రాశారు. ఆలేరు నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన భూములు, అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎంకి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లేఖ రాశారు. తమ నియోజకవర్గంలో హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకు రావాలని మానుకొండూర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే కాలే యాదయ్య, తదితరులు రేవంత్‌కి లేఖ రాశారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS