TEJA NEWS

తెలంగాణ ప‌ర్యాట‌క‌ అభివృద్ధికి చేయూత నివ్వండి

కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షకావ‌త్ ను క‌లిసిన మంత్రి జూప‌ల్లి

తెలంగాణ ప‌ర్యాట‌క రంగ అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర ప‌ర్యాట‌క‌ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్‌ను రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కోరారు. ఢిల్లీలోని గజేంద్ర షకావత్‌ క్యాంపు కార్యాలయంలో ఆయనతో మంత్రి జూప‌ల్లి సమావేశమయ్యారు. తెలంగాణ‌లో టూరిజం అభివృద్థికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని జూప‌ల్లి తెలిపారు.ప‌ర్యాట‌క అభివృద్ధికి నిధులిస్తే టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని ఆయన వివ‌రించారు. దీనిపై కేంద్రమంత్రి షకావత్‌ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ టూరిజం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.

అనంత‌రం మంత్రి జూప‌ల్లి మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని ర‌కాల మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌ని, ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్లుతున్నామ‌ని అన్నారు. ఎకో, వాట‌ర్ బాడీస్, టెంపుల్, హెల్త్ అండ్ వెల్నెస్ టూరిజంకు తెలంగాణ అనుకూలంగా ఉంద‌ని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వార్షిక బ‌డ్జెట్ లో రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు కేటాయించింద‌ని చెప్పారు. తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధికి.. కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం కూడా అవ‌స‌ర‌మ‌ని, నిధులు కేటాయించాల‌ని గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ను కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. సీయం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూత‌న ప‌ర్యాట‌క విధానం తీసుకువ‌చ్చి… తెలంగాణ‌ను దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

మంత్రి వెంట‌ తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ ముఖ్య‌కాద‌ర్శి వాణిప్ర‌సాద్, ప‌ర్యాట‌క అభివృద్ది సంస్థ ఎండీ ప్ర‌కాష్ రెడ్డి, తదిత‌రులు ఉన్నారు.

ప్ర‌భుత్వ ఆస్తులు ఆక్ర‌మించిన వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు

అక్ర‌మ క‌ట్ట‌డాల‌ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించిన చర్యలు తప్పవని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఆస్తి అంటే ప్ర‌జ‌ల ఆస్తి అని, దాని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాల వ‌ల్ల ప్ర‌భుత్వ భూములు అన్యాక్రాంత‌మ‌య్యాయ‌ని, భ‌విష్య‌త్ త‌రాల వారికి సంప‌ద‌ను కాపాడ‌వ‌లసిన అవ‌స‌రం ఉంద‌ని.. అందుకే వాటి ప‌రిర‌క్ష‌ణ‌ను చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లు తామ ప‌ని తాము చేసుకుపోతున్నాయ‌ని, ప్ర‌భుత్వం అధికారుల‌కు పూర్తి స్వేచ్చ‌ను ఇచ్చింద‌ని అన్నారు…24/08/2024

Print Friendly, PDF & Email

TEJA NEWS