TEJA NEWS

కేటీఆర్‌పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్..

వరంగల్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని, సెక్రటరీయేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కేటీఆర్‌కు ఎందుకు కోపం అని ప్రశ్నించారు. తన తండ్రిదో, చెల్లెదో విగ్రహం పెట్టాలని అనుకున్నట్టుంది.. అందుకే మళ్లీ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహం కూల్చేస్తామంటున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదని అన్నారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.

కాగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని పెట్టి.. ఆ తల్లి ఆత్మను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సకల మర్యాదలతో రాజీవ్‌ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలిస్తామని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టమైతే జూబ్లీ హిల్స్‌లోని ఆయన ఇంట్లో పెట్టుకోవాలని అన్నారు. ‘గణేశ్‌ నిమజ్జనం రోజు చెబుతున్నా.. రాసిపెట్టుకో… రాజీవ్‌ విగ్రహాన్ని సచివాలయం ముందు నుంచి తొలగిస్తాం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

సచివాలయం ఎదుట రాజీవ్‌ విగ్రహం ఏర్పాటును నిరసిస్తూ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని తాము నిర్ణయించిన స్థలంలో ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రేవంత్‌ సర్కారు రాజీవ్‌ విగ్రహం పెట్టిందన్నారు. ‘రాజీవ్‌ కంప్యూటర్‌ కనిపెట్టారని అంటున్నావు. కంప్యూటర్‌ను కనిపెట్టిన చార్లెస్‌ బాబేజ్‌ ఆత్మ బాధపడుతుందని నీకు తెలియదు’అని సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మన దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేసింది రాజీవ్‌ కాదని, 1955లో టాటా గ్రూప్‌ సంస్థ పరిచయం చేసిందన్నారు.

రాష్ట్రంలో సరైన పాలనే లేదని, అలాంటిది కాంగ్రెస్‌ నేతలు సెప్టెంబర్ 17ను ప్రజా పాలనా దినోత్సవమంటున్నారని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, ఒక్క నెలలో 30 హత్యలు జరిగినట్లు వార్తలు వచ్చాయన్నారు. రాష్ట్రానికి హోం మంత్రిని పెట్టి శాంతిభద్రతలు కాపాడాలన్నారు. ‘బిల్లులు చెల్లించక పోలీసుల వాహనాల్లో పెట్రోలు పోయించుకోలేని పరిస్థితి, సర్కారు బడుల్లో చాక్‌పీస్‌లు కొనలేని పరిస్థితి. గురుకులాలు, వసతి గృహాల బిల్లుల పెండింగ్‌తో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. నోరుంది కదా అని 9 నెలల పాటు కేసీఆర్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నావ్‌.. ఇప్పటికైనా పాలనపై దృష్టిపెట్టు’ అని సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సూచించారు.


TEJA NEWS